Rini Sampath: వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో రినీ సంపత్.. వివరాలివే

భారత సంతతికి చెందిన మహిళ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో ఉన్నారు. తమిళనాడులోని తేని నగరానికి చెందిన 31 ఏళ్ల రినీ సంపత్ తల్లిదండ్రులు ఆమె చిన్న వయస్సులోనే అమెరికాకు వెళ్లారు. ఏడేళ్ల వయస్సులో రినీ అమెరికా వెళ్లారు. చదువు, ఉద్యోగం అక్కడే పూర్తి చేశారు. విద్యార్థి సంఘ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఓ ఏజెన్సీకి నిర్వాహకురాలిగా సేవలు అందించారు.
అదే సమయంలో ఆమె వాషింగ్టన్లోని సమస్యలపై గళమెత్తి ప్రజలకు చేరువయ్యారు. ఎమర్జెన్సీ నెంబర్ 911కు ఫోన్ చేసినా స్పందన ఆలస్యంగా ఉండటం, పోటోమాక్ నదిలో మురుగునీరు చేరడం, మంచు తుపాను కారణంగా కాలి నడక బాటలు ప్రమాదకరంగా మారడం వంటి అంశాలపై ఆమె గళమెత్తారు.
ఇదే అనుభవంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వాషింగ్టన్ డీసీలో మౌలిక వసతుల కల్పన, సత్వర ప్రజాసేవ, వేగంగా స్పందించే కాల్ సెంటర్లు అవసరమని గుర్తించి వాటిపై ఆమె హామీ ఇస్తున్నారు. జీవన వ్యయం తగ్గించేలా ప్రభావవంతమైన చర్యలు చేపడతామని అన్నారు. తాను రాజకీయ పార్టీ నాయకురాలిని కాదని, తన వెనుక ఏ పార్టీ కూడా లేదని చెబుతూ, 'కొత్త వాషింగ్టన్' నిర్మాణమే తన లక్ష్యమని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
