PM Modi: విక్టరీ డే వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని

ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం పలికారు. మే 9న మాస్కోలో జరగనున్న విక్టరీ డే వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది మే 9న ఈ విక్టరీ వేడుకలు జరుగుతుంటాయి. 80 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోడీని పుతిన్ ఆహ్వానించారు. ఈ వేడుకల్లో మోడీ పాల్గొంటారని రష్యా ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా సైనిక బలం, చారిత్రక వారసత్వాన్ని ప్రదర్శించే కార్యక్రమంలో పాల్గొనమని భారతదేశంతో పాటు అనేక మిత్ర దేశ నాయకులకు ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నారు.
రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తన మిత్రదేశాలకు ఆహ్వానం పంపుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపింది. విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు.
కాగా, గతేడాది జూలైలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించారు. గత పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని పుతిన్ కూడా అంగీకరించారు. అయితే, తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ‘పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. గతేడాది మోదీ మాస్కోలో పర్యటించారు.. ఇప్పుడు మా వంతు’ అని రష్యా రాయబార కార్యాలయం గత నెల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక పుతిన్, మోదీలు తరచూ ఫోన్లో టచ్లోనే ఉన్నారు. వివిధ అంశాలపై సంభాషించుకుంటున్నారు. అంతేకాదు పలు అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరువురు నేతలు సమావేశమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com