Earthquake: ఫిలిప్పీన్స్ను వదలని భూకంపాలు.. మరోసారి భారీగా ప్రకంపనలు!

ఫిలిప్పీన్స్ను భూకంపాలు బయపెడుతున్నాయి. గత కాలంగా ఆ దేశంలో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా తెల్లవారుజామున మరోసారి ఫిలిప్పీన్స్ లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఫిలిప్పీన్స్ లోని మిండానావో ప్రాంతంలో ఉదయం 7 గంటలకు 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం భూమికి 90 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని NCS తెలిపింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.
ఫిలిప్పీన్స్ గత కొంతకాలంగా ఇలాంటి భూకంపాల ప్రకంపనలను ఎదుర్కొంటోంది. ఈ తాజా భూకంపం కేవలం వారం రోజుల క్రితం అంటే అక్టోబర్ 10న, దక్షిణ ఫిలిప్పీన్స్ను కుదిపేసిన భూకంపం తరువాత వచ్చింది. అక్టోబర్ 10న ఏకంగా 7.4 తీవ్రతతో భయంకరమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా 7 మంది మరణించారు. ఆ భూకంపంలో అనేక పాఠశాల భవనాలు, ఒక ఆసుపత్రి దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. తీవ్ర ప్రకంపనల అనంతరం సునామీ హెచ్చరిక కూడా జారీ చేయబడింది. దీని తరువాత ఉపసంహరించుకున్నారు. ఈ హెచ్చరిక కారణంగా తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com