తాలిబన్లుతో కలిసి అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమే-అఫ్ఘాన్ ప్రభుత్వం

అఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. గురువారం నాటికే ఆఫ్ఘనిస్తాన్లోని 65 శాతం భూభాగాన్ని ఆక్రమించిన తాలిబన్లు... తాజాగా దేశంలోని మరిన్ని పట్టణాల్ని, ప్రాంతాల్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. కాందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు వెల్లడించారు. ఇది ఆ దేశ రాజధాని కాబూల్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో దేశంలోని మూడింట రెండొంతుల భూభాగం తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. వారం రోజుల్లోపు దేశం మొత్తాన్ని ఆక్రమిస్తామని వారు ప్రకటించారు.
అమెరికా, నాటో సేనలు ఈ నెలాఖరుకు పూర్తిగా వైదొలగనున్న నేపథ్యంలో అఫ్ఘాన్ క్రమంగా మళ్లీ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. మిలిటరీ బలగాలు సైతం తాలిబన్లకు లొంగిపోతున్నాయి. తాలిబన్లు కాందహార్ సెంట్రల్జైలును ఆక్రమించారు. ఇప్పటికే ఆఫ్ఘన్లోని దాదాపు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లకు ఇక మిగిలింది దేశరాజధాని కాబూలే. తాలిబన్ల మెరుపుదాడులకు సమాధానం చెప్పలేని అక్కడి ప్రభుత్వం రాయబారానికి దిగింది. మధ్యవర్తిగా ఉండాల్సిందిగా గల్ఫ్ దేశం ఖతార్ను కోరింది. హింసను పక్కనబెడితే అధికారాన్ని పంచుకునేందుకు కూడా సిద్ధమనే ప్రతిపాదనను పంపింది. అయితే దీనిపై తాలిబన్లు ఇంకా స్పందన తెలపలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com