Tehran: ఇజ్రాయెల్ ఆరోపణను ఖండించిన టెహ్రాన్..

గత 12 రోజులుగా ఆయుధాలతో యుద్ధం చేసుకున్న ఇజ్రాయెల్-ఇరాన్.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే టెహ్రాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, తమపై క్షిపణులతో దాడులకు దిగిందని టెల్అవీవ్ ఆరోపిస్తోంది. ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్కు గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. టెల్ అవీవ్ ఆరోపణలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్పై తాము ఎలాంటి దాడులూ చేయలేదని ఇరాన్ సైనికాధికారులు వెల్లడించారు. శత్రువుల మాటలపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తమ చేతులు ట్రిగ్గర్పైనే ఉన్నాయని వెల్లడించారు. శత్రువు చేసే ఏదైనా దురాక్రమణకు నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు గంటలకే తమ గగనతలంపైకి ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగాయని, ఆయా ప్రాంతాల ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశాలు వెళ్లాయని వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్ను ఆదేశించానని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. టెహ్రాన్లోని అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని సూచించినట్లు వెల్లడించారు. తమ వైమానిక దళాన్ని, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com