Treasure: సరదాగా హైకింగ్‌కు వెళ్తే.. కోట్ల నిధి లభ్యం

Treasure: సరదాగా హైకింగ్‌కు వెళ్తే.. కోట్ల నిధి లభ్యం
X
ఇద్దరు పర్యాటకులకు భారీ మొత్తంలో ఆభరణాలు, నాణేలు

ప్రకృతిని ఆస్వాదిద్దామని హైకింగ్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అనూహ్యంగా కోట్లాది రూపాయల సంపద దొరికింది. చెక్ రిపబ్లిక్‌లోని ఈశాన్య పర్వతాల్లో ఈ సంఘటన వెలుగు చూసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..

చెక్‌ రిపబ్లిక్‌లోని పోడ్కర్కోనోసి పర్వతాల్లో ఇటీవల ఇద్దరు పర్యాటకులు హైకింగ్‌కు వెళ్లారు. అలా వారు ముందుకువెళ్తుండగా.. ఆ ప్రాంతంలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించాయి. అంత మొత్తాన్ని అక్కడ చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ సంపద అంతా ఈస్ట్ బొహెమియన్‌ మ్యూజియంలో ఉంది. ఇది జరిగింది ఫిబ్రవరి నెలలో అయినా తాజాగా మ్యూజియం ఆ విషయాన్ని ఇప్పుడు వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న నాణేలు 1808 కాలం నాటివిగా గుర్తించినట్లు తెలిపింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్‌ సామ్రాజ్య కాలం నాటి ఆ నాణేలు 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వంద సంవత్సరాల క్రితమే వాటిని భూమిలో దాచి పెట్టినట్లు అంచనా వేస్తున్నారు.

‘‘హైకర్స్ ఆ సంపదను చూపించినప్పుడు.. నేను ఎంతో ఆశ్చర్యపోయా. వీటిని ఇంకా విశ్లేషించాల్సి ఉంది. అయితే ఆ విలువైన లోహాల ప్రారంభ విలువే రూ.2.87 కోట్లు (340,000 డాలర్లు)గా ఉండొచ్చు. భూమిలో విలువైన వస్తువులను నిధుల రూపంలో నిల్వ చేయడం ప్రీహిస్టారిక్ సమయంలో ఒక ఆచారంగా ఉండేది. అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సమయంలో దానిని భూమిలో దాచి, తర్వాత వచ్చి దానిని తీసుకుందామనుకునే ఉద్దేశమూ ఈ నిధి వెనక కారణం కావొచ్చు’’ అని మ్యూజియం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీలు ఈ నిధిని దాచి ఉండొచ్చన్న వాదనా ప్రచారంలో ఉంది. అయితే చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం.. ఆ నిధిలో పది శాతం హైకర్స్ దక్కొచ్చని ఉందని మీడియా కథనం పేర్కొంది.

Tags

Next Story