Niger : ఆఫ్రికా దేశంలో సైన్యం తిరుగుబాటు

పశ్చిమ ఆఫ్రికాలో కీలక దేశమైన నైజర్లో సైన్యం తిరుగుబాటు ప్రకటించింది. ఈ ఆకస్మిక పరిణామం మిత్ర దేశమైన అమెరికా తో పాటు నైజర్ చుట్టుపక్కల ఉన్న ఆఫ్రికా దేశాలను కలవరానికి గురిచేసింది. సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించబడింది.
నైజర్లో అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం ప్రకటించింది. సైనికులు తిరుగుబాటును జాతీయ టెలివిజన్లో ప్రకటించారు. ఈ ప్రకటనలో నైజర్లోని అన్ని సంస్థలను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సైన్యం తెలిపింది. కల్నల్ మేజర్ అబ్ద్రమనే బృందం తాము దేశ జాతీయ భద్రతా మండలిగా చెప్పుకున్నారు.
అక్కడి వార్తాసంస్థల కథనం ప్రకారం.. నైజర్ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ను అధికారం నుంచి సైన్యం తొలగించింది. విషయాన్ని కొన్ని గంటల తరువాత జాతీయ టెలివిజన్లో కనిపించి తిరుగుబాటును ప్రకటించింది. ఈ ఘటనపై అమెరికా స్పందించింది. ఈ విషయంపై ఆంటోనీ బ్లింకెన్ న్యూజిలాండ్లో విలేకరులతో మాట్లాడారు. నైజర్ లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన అధ్యక్షుడిగా యూఎస్ అతనికి గట్టిగా మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మహమ్మద్ బజౌమ్ను వెంటనే విడుదల చేయాలని సైన్యాన్ని డిమాండ్ చేశారు.
ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు తనపై తిరుగుబాటుకు ప్రయత్నించారని నైజర్ ప్రెసిడెంట్ కూడా మీడియాకు ప్రకటించారు. నైజర్ అధ్యక్షుడు బజౌమ్ 2021లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యారు. నైజర్ ఫ్రాన్స్, ఇతర పశ్చిమ దేశాలకు సన్నిహిత మిత్రదేశంగా పరిగణలో ఉంది. అలాగే నైజర్లో యూఎస్ డ్రోన్స్ స్థావరాలను కలిగి ఉంది. 1960లో ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి నైజర్లో తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ దేశంలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులకు చెందిన గ్రూపులు చురుగ్గా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com