Indian American: ట్రంప్ పాలకవర్గంలో మరో భారత అమెరికన్ వ్యాపారవేత్తకు ఛాన్స్..

యూఎస్ కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన కార్యవర్గంలో ఇండో- అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన నేతలకు ఆయన కీలక బాధ్యతలు ఇచ్చారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంలో మరో భారత అమెరికన్ వ్యాపారవేత్తకు స్థానం కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై వైట్హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్గా వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్ను నియమించారు.
అయితే, వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్ విధులు నిర్వహించనున్నారు. శ్వేథసౌధం ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఒ శాక్స్తో కలిసి ఆయన పని చేయబోతున్నారు. కృత్రిమ మేధతో అమెరికన్ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోనున్నారని ట్రంప్ చెప్పారు. దీనికి శ్రీరామ్ కృష్ణన్ స్పందిస్తూ కాబోయే అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.
కాగా, తమిళనాడులోని చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. 2007లో మైక్రోసాఫ్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఫేస్బుక్, యాహూ, ట్విటర్ (ఎక్స్), స్నాప్ లాంటి సంస్థలో విధులు నిర్వహించారు. 2022లో ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసినప్పుడు కృష్ణన్ అక్కడే ఉన్నారు. ఆ టైంలో సంస్థ తదుపరి సీఈఓగా కృష్ణన్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం కొనసాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com