అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరమంటూ ప్రచారం
కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జ్వరంతో బాధపడుతున్న ఆయన శరీరంలోని ప్రాథమిక ప్రమాణాలు ఉండాల్సిన స్థాయి కంటే తక్కువగా ఉంటున్నట్లు సమాచారం. న్యూయార్క్ టైమ్స్ సమాచారం ప్రకారం ఆయన ఆక్సిజన్ స్థాయి 60-70కి తగ్గింది. ఊపిరితిత్తుల్లో విపరీతంగా ఇబ్బంది వచ్చింది. దాంతో వెంటనే ఆయనకు కృత్రిమంగా ఆక్సిజన్ను అందించడం మొదలు పెట్టారు. పరిస్థితి విషమించవచ్చని భావించి శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ను వైట్ హౌస్ నుంచి వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అధ్యక్షుడి ప్రత్యేక హెలికాప్టర్ మెరైన్ వన్లో ఆయనను హుటాహుటిన తరలించారు. వచ్చే 48 గంటలూ చాలా కీలకమని, సంక్లిష్టంగా మారే ప్రమాదముందని వాల్టర్ రీడ్లో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై కొందరు అంటున్నారు.
అసలు ఎప్పటికి కోలుకుంటారన్న విషయమే డాక్టర్లు చెప్పలేని పరిస్థితి ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి. ఈ సమాచారంతో అమెరికాలో ఆందోళన తారస్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి ఆయనకు రీజెనరాన్ కంపెనీ తయారుచేసిన యాంటీబాడీస్ మిశ్రమాన్ని ఎక్కించారు. ఎనిమిది గ్రాముల డోసును ఆయనకు ఎక్కించారని, అంతా సాఫీగా జరిగిందని వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే ఓ ప్రకటనలో తెలిపారు. వైర్స-నిరోధక మందు రెమ్డెసివిర్ను కూడా ఆయనకు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే కాన్లే పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించకుండా కొంత గోప్యత పాటించారు.
ఆసుపత్రికి వెళ్లే ముందు ట్రంప్ ఓ వీడియోను ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు. 'మీరు చూపుతున్న మద్దతుకు కృతజ్ఞుణ్ణి... నేను బాగానే ఉన్నానంటూ వీడియో పోస్ట్ చేశారు. అన్నీ సజావుగానే సాగుతాయని ఆశిస్తున్నానన్నారు'. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఆందోళన చెందవద్దని ట్విట్టర్ ద్వారా ట్రంప్ వెల్లడించారు. వైట్హౌస్ వర్గాల సమాచారం ప్రకారం...ఆయనకు ఫెమోటిడిన్, మెలాటినిన్, ఆస్ర్పిన్లతో పాటు జింక్, విటమిన్-డీ కి సంబంధించిన మందులూ ఇస్తున్నట్లు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com