Trump: ప్రాణం కాపాడిన మహిళకు ట్రంప్ కృతజ్ఞతలు

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ఇటీవల దుండగుడు కాల్పులు జరిపిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ మహిళ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని ట్రంప్ తాజాగా వెల్లడించారు. హారిస్బర్గ్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆమెను వేదిక పైకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు.
పెన్సిల్వేనియా ప్రచార సభలో తాను మాట్లాడుతున్న సమయంలో.. దుండగుడు కాల్పులు జరపడానికి కొన్ని నిమిషాల ముందు జరిగిన సంఘటనను ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ‘‘కంప్యూటర్ సెక్షన్ సిబ్బందిలో ఒక మహిళ వలసదారుల చార్ట్ను స్క్రీన్పై ప్రదర్శించింది. దాన్ని చూసేందుకు నా తలను అటు వైపుగా తిప్పా. ఆ సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. అంతలోనే నా తలకు బదులు చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమె వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను.’’ అని అన్నారు.
హారిస్బర్గ్ ప్రచార సభలో ఆ మహిళను వేదిక పైకి పిలిచి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను ‘కంప్యూటర్ జీనియస్’ అంటూ కొనియాడారు. కాగా.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తనపై హత్యాయత్నం జరిగిన ఘటన అనంతరం తొలిసారి ప్రచారంలో పాల్గొన్నారు. కాల్పులు జరిపిన చోటే మళ్లీ ఈ ర్యాలీని నిర్వహించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com