Apple Iphone : డిలీట్ చేసిన మెసేజ్లు చూసి విడాకులు అడిగిన భార్య, యాపిల్పై దావా వేసిన భర్త

ఇంగ్లాండ్లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు. ఇంగ్లండ్కు చెందిన ఆయన తన ఐఫోన్లోని ఐ మెసేజ్ యాప్ నుంచి సెక్స్ వర్కర్లతో చాట్ చేసేవాడు. అవి భార్య కంట పడకుండా డిలీట్ చేస్తూ జాగ్రత్త పడేవాడు. అయితే, తన ఫోన్ ఐడీనే కుటుంబం ఉపయోగించే ఐమ్యాక్కు లింక్ చేసిన విషయాన్ని మర్చిపోయాడు. చాటింగ్ మెసేజ్లను ఫోన్లో డిలీట్ చేసినప్పటికీ ఐమ్యాక్లో అలానే ఉండిపోయాయి. ఒకరోజు వాటిని చూసిన ఆయన భార్య.. విడాకులకు దరఖాస్తు చేసింది.
దీంతో సదరు వ్యాపారవేత్త యాపిల్పై కోర్టుకెక్కాడు. విడాకులు మంజూరైతే ఆమెకు దాదాపు రూ. 53 కోట్లు చెల్లించాల్సి వస్తుందని, కాబట్టి వాటిని ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేస్తే మొత్తంగా డిలీట్ అయ్యాయనే అనుకుంటామని, ఈ విషయంలో యాపిల్ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నది అతడి వాదన.“ఈ సందేశాలు ఇతర పరికరాల నుండి తొలగించబడవని నాకు తెలిసి ఉంటే, నేను నా భార్యతో మాట్లాడేవాడిని, బహుశా మా విడాకులు జరిగేవి కావు. ఇప్పుడు ఆమె నేరుగా మెసేజ్లు చూడడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది.” అని ఆయన అన్నారు. మెసేజ్లు డిలీట్ చేసినప్పుడు ఆ డివైజ్లో మాత్రమే డిలీట్ అయినట్టు మెసేజ్ వస్తే యూజర్లు అప్రమత్తమవుతారని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని, కాబట్టి తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని ఆ పిటిషన్లో కోరాడు. దీనివల్ల తాను 5 మిలియన్ పౌండ్లు నష్టపోయానని.. ఇందుకు గానూ యాపిల్ తనకు 5 మిలియన్ పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.53కోట్లు ) చెల్లించాలని దావా వేశాడు. ఈ పిటిషన్పై స్థానిక కోర్టు త్వరలో విచారణ జరపనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com