Zelenskyy: 117 డ్రోన్లు, 18 నెలల ప్లానింగ్.. అద్భుతమైన ఆపరేషన్..

రష్యాలోని కీలక సైనిక స్థావరాలపై ఆదివారం ఉక్రెయిన్ 117 డ్రోన్లతో జరిపిన భారీ స్థాయి దాడి వెనుక 18 నెలల పక్కా ప్రణాళిక ఉంది. ట్రక్కులలో వేల కిలోమీటర్లు ప్రయాణించి రష్యా వైమానిక స్థావరాలకు అత్యంత సమీపం వద్దకు చేరుకున్న వందకు పైగా డ్రోన్లు రష్యాకు చెందిన ఐదు కీలకమైన వైమానిక స్థావరాలను బాంబులతో పేల్చివేశాయి. ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ పేరుతో ఉక్రెయిన్ భద్రతా సర్వీసు ఎస్బీయూ ఈ దాడికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించడమే కాకుండా ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా అమలు చేసింది. ఉక్రెయిన్ ఉపయోగించిన ఫస్ట్ పర్సన్ వ్యూ(ఎఫ్పీవీ) డ్రోన్లు రష్యాలోని ముర్మన్స్క్, ఇర్కుత్స్క్, ఇవానోవో, రియాజన్, అమూర్ ప్రాంతాలలోని ఐదు వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు రష్యా ధ్రువీకరించింది. ఈ దాడులలో అనేక యుద్ధ విమానాలు దగ్ధమయ్యాయని రష్యా వెల్లడించింది.
2022లో రష్యా దురాక్రమణకు పాల్పడిన తర్వాత ప్రతిస్పందనగా ఉక్రెయిన్ పలుమార్లు రష్యాలోని లక్ష్యాలపై డ్రోన్ల దాడి జరిపింది. కాని ఈసారి మాత్రం ఉక్రెయిన్ ఉపయోగించిన పద్ధతి పూర్తి భిన్నమైనది. యుద్ధ ముప్పును ఎదుర్కొంటున్న దేశాలను ఆలోచింపచేసే రీతిలో ఇది ఉంది. ఏడాదిన్నర ప్రణాళిక తర్వాత ఈ డ్రోన్ల దాడిని అమలు చేసినట్లు ఎస్బీయూ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం భారీ వాహనాల అవసరం కీలకంగా మారింది. ముందుగానే రష్యాలోకి డ్రోన్లను అక్రమంగా తరలించడం జరిగింది. ట్రక్కులపై ఏర్పాటు చేసిన చెక్క క్యాబిన్లకు చెందిన పైకప్పు కింద డ్రోన్లను దాచి పెట్టినట్లు నిఘా వర్గాలు వివరించాయి. దాడి జరిపే సమయంలో రిమోట్ కంట్రోల్ ద్వారా క్యాబిన్ల పైకప్పు తొలగిపోయి డ్రోన్లు పైకి ఎగిరి సమీపంలోని తమ లక్ష్యాలను చేరుకున్నాయి. రవాణా కంటెయినర్లలో దాచిన నల్ల రంగు డ్రోన్లకు సంబంధించిన ఫొటోలను ఎస్బీయూ షేర్ చేసింది. తాజా దాడిని రష్యా పెరల్ హార్బర్ దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ దాడి సమన్వయం కోసం రష్యా ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే ఉక్రెయిన్ గూఢచారులు కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటుచేసుకోవడం గమనార్హం.
ఉక్రెయిన్ నుంచి ఈ డ్రోన్లను ప్రయోగించలేదని, వీటిని తమ వైమానిక స్థావరాలకు అత్యంత సమీపంలో నుంచే ప్రయోగించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించడం ఉక్రెయిన్ చేస్తున్న వాదనకు బలం చేకూరుస్తున్నది. ఇర్కుత్స్క్ ఓబ్లాస్త్లోని బలయా ఎయిర్బేస్ ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 4,300 కిలోమీటర్లు ఉంటుంది. ముర్మన్స్క్ ఓబ్లాస్త్లోని ఒలేన్యా ఎయిర్బేస్ ఉక్రెయిన్ నుంచి 2,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు ఎయిర్బేస్ల నుంచి దగ్ధమవుతున్న రష్యా యుద్ధ విమానాలకు చెందిన దట్టమైన నల్లని పొగ వెలువడుతున్న దృశ్యాలను కూడా ఎస్బీయూ షేర్ చేసింది.
బాంబులు అమర్చిన 100కిపైగా ఎఫ్పీవీ డ్రోన్లను ముందుగానే రష్యాలోకి తరలించామని ఎస్బీయూ చీఫ్ వాసిలీ మాలియుక్ వెల్లడించారు. చిన్న సైజులో ఉండే ఈ డ్రోన్లకు ముందు వైపున కెమెరాలు అమర్చి ఉంటాయి. వీటిని ఆపరేట్ చేసే వ్యక్తి లైవ్ వీడియో చూడవచ్చు. ఎక్కడో మారుమూల ఉండి దీన్ని ఆపరేట్ చేసే వ్యక్తి కచ్చితత్వంతో లక్ష్యంపై దాడి చేసే అవకాశం పూర్తిగా ఉంటుంది. కాగా, ట్రక్కులను నడుపుతున్న వ్యక్తులకు తాము రవాణా చేస్తున్న దేమిటో తెలిసే అవకాశం కూడా ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2022లో కూడా ఇదే రకమైన ఆపరేషన్ జరిగిందని, లారీలో రహస్యంగా తరలిస్తున్న బాంబు క్రిమియా, రష్యాను కలిపే కెర్చ్ వంతెనను పేల్చివేసిందని వారు గుర్తు చేశారు. డ్రోన్ల దాడికి ఉక్రెయిన్ వేసిన ఎత్తుగడ చాలా వినూత్నమైనదని, వేరే చోట వైమానిక దాడులు జరుపుతున్నట్లు దృష్టి మళ్లించి రష్యా తన యుద్ధ విమానాలను ఒక చోటుకు తరలించేలా ఉక్రెయిన్ ప్రణాళిక వేసి విజయం సాధించిందని వారు తెలిపారు. ఒలేన్యా వైమానిక స్థావరాలకి డజన్ల సంఖ్యలో రష్యా యుద్ధ విమానాలను మూడు రోజుల క్రితమే తరలించిందని, జూన్ 1న జరిగిన డ్రోన్ల దాడిలో తీవ్రంగా నష్టపోయింది ఇక్కడేనని విశ్లేషకులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com