Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. టారిఫ్లు నిలిపివేసిన ఫెడరల్ కోర్టు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ప్రకటించిన ప్రతీకార సుంకాలపై ట్రేడ్ కోర్టు బుధవారం స్టే విధించింది. అమెరికాకు ఎక్కువ మొత్తంలో వస్తువులను విక్రయించి.. తమ నుంచి తక్కువకే కొనుగోలు చేస్తోన్న దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించిన విషయం తెలిపింది. ఈ విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని మించి వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యానించింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అసాధారణమైన, అత్యవసరమైన ముప్పులను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు విధించే అధికారం తనకు ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ కోర్టు దీనిని వ్యతిరేకించింది. అంతేకాదు, సుంకాలపై స్టే విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతికూలతలు ఎదురవుతాయని, ఇటీవల భారత్ పాకిస్థాన్ సైనిక ఘర్షణలు దీని వల్లే ఆగిపోయాయంటూ ట్రంప్ యంత్రాంగం చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
IEEPA ఆధారంగా ట్రంప్ తీసుకొచ్చిన టారిఫ్లతో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశారని కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం రెండు అణ్వాయుధ శక్తుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ట్రంప్ మౌలికంగా జోక్యం చేసుకుని టారిఫ్ ప్రోత్సాహంతో కాల్పుల విరమణ సాధించారని పేర్కొన్నారు. జూలై 7 నాటికి అనేక దేశాలతో ట్రేడ్ ఒప్పందాలను ఖరారు చేయాల్సిన నేపథ్యంలో, ఈ అంశం "సున్నితమైన దశలో" ఉందని వారు కోర్టుకు తెలియజేశారు.
కోర్టు ఏం చెప్పింది?
న్యూయార్క్లోని మన్హట్టన్కు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. IEEPA ఆధారంగా అధ్యక్షుడికి పరిమితి లేని అధికారాలను కాంగ్రెస్ అప్పగించలేదని స్పష్టం చేసింది. ‘IEEPA చట్టం ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో అసాధారణ ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక ఆంక్షలు మాత్రమే అధ్యక్షుడు విధించగలరు’ అని పేర్కొంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యంపై నియంత్రణ అధికారం కేవలం కాంగ్రెస్ మాత్రమే ఉందని వివరించింది. ‘అధ్యక్షుడికి టారిఫ్లను విధించే అధికారం ఉందా? లేదా? అనేది కోర్టు వ్యాఖ్యానించదు. అది చట్టపరంగా అనుమతించబడదని మాత్రమే కోర్టు స్పష్టం చేస్తుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టారిఫ్ అధికార పరిమితిని దాటి ఉపయోగించుకోవడం రాజ్యాంగ ధిక్కరణే అవుతుందని తెలిపింది.
ట్రంప్ యంత్రాంగం స్పందన
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ యంత్రాంగం అప్పీల్ దాఖలు చేసింది. న్యాయస్థానం స్టే విధించడం విదేశాలపై టారిఫ్లు విధించే శక్తిని తగ్గించడమేనని, ఇది వ్యూహాత్మకంగా ఆర్థిక సాధనాలను ఉపయోగించేందుకు ఆటంకం కలిగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను ఇది దెబ్బతీయచ్చని అన్నారు. ఏప్రిల్ 2న ట్రంప్ అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములపై ట్రంప్ టారిఫ్లు ప్రకటించారు. ప్రాథమికంగా 10% టారిఫ్ విధించి, ముఖ్యంగా చైనా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలపై ఎక్కువ టారిఫ్లు విధించారు.
కానీ, అమెరికా ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడటంతో కొన్ని దేశాలపై టారిఫ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. మే 12న, చైనాపై విధించిన భారీ టారిఫ్లను తాత్కాలికంగా తగ్గించినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. రెండు దేశాలు పరస్పరం 90 రోజుల పాటు టారిఫ్లను తగ్గించుకోవడానికి అంగీకరించాయి. ఇక, భారత్తోనూ జులై 8లోగా ఒప్పందానికి ట్రంప్ గడువు విధించిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com