అమెరికా ఎన్నికలు : 12 స్వింగ్‌స్టేట్స్‌ ఫలితాల్లో మలుపులు

అమెరికా ఎన్నికలు : 12 స్వింగ్‌స్టేట్స్‌ ఫలితాల్లో మలుపులు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి. కీలకమైన 12 స్వింగ్‌స్టేట్స్‌లో ఫలితాలు మలుపులు తిప్పడంతో... అసలు పోరు మొదలైంది. కౌంటింగ్‌ మొదట్లో బైడెన్‌ ఆధిపత్యం కనిపించినా.. ఆ తర్వాత ట్రంప్‌ వైపు మొగ్గు చూపాయి. కేవలం అరిజోనా, న్యూహాంప్‌షైర్‌, నెవడాలు మొదటి నుంచి బైడెన్‌కు పట్టంకట్టాయి. కానీ, విస్కాన్సిన్‌ ఫలితాలు మాత్రం ట్రంప్‌, బైడెన్‌ ఇద్దరికి చుక్కలు చూపిస్తున్నాయి. మొత్తం 10 ఎలక్టోరల్‌ ఓట్లున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బైడెన్‌ 1 శాతం ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్‌ మధ్యలో ట్రంప్‌ దాదాపు 4శాతానికి పైగా ఆధిక్యంలో దూసుకుపోయినా.. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయారు. 95శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి బైడెన్‌కు 49.09 శాతం పోల్‌కాగా.. ట్రంప్‌నకు 48.94 శాతం ఓట్లు పోలయ్యాయి. మరో ఐదుశాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. అవి ఇక్కడి 10 ఎలక్టోరల్‌ ఓట్లు ఎవరికి దక్కనున్నాయో తేల్చనున్నాయి.

ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కే అవకాశం ఉంది. అప్పుడు ఫెయిత్‌లెస్‌ ఎలక్టోరల్‌ ఓట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు 306 ఎలక్టోరల్‌ ఓట్లు వస్తే వారిలో ఇద్దరు ట్రంప్‌కు ఓటు వేసేందుకు నిరాకరించారు. అలానే 227 ఓట్లు హిల్లరీకి రాగా.. వారిలో ఐదుగురు ఆమెకు ఓటు వేసేందుకు నిరాకరించారు. ప్రస్తుతం జో బైడెన్‌ 232 ఎలక్టోరల్‌ ఓట్లతో ముందంజలో ఉన్నారు. 2016 డెమొక్రాటిక్‌ పార్టీకి వచ్చిన స్థానాల కంటే ఇవి ఎక్కువ. అరిజోనాలో గెలుపుతో బైడన్‌, హిల్లరీ రికార్డు దాటేశారు. గతంలో అరిజోనాను ట్రంప్‌ గెలుచుకున్నారు. దీంతో ఆ 11 ఎలక్టోరల్‌ ఓట్లు తగ్గాయి. 1948లో హారీ ట్రూమన్‌కు ఓటేసిన ఈ రాష్ట్రం.. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత 1996లో బిల్‌ క్లింటన్‌కు పట్టం కట్టింది. మళ్లీ ఇప్పుడు జోబైడెన్‌ వైపు మొగ్గు చూపడం డెమొక్రాటిక్‌ బృందంలో ఉత్సాహాన్ని నింపింది.

ఇక పెన్సిల్వేనియాలోని 20 ఎలక్టోరల్‌ ఓట్లు కీలకంగా మారాయి. దీన్ని గెలిస్తే మేజిక్‌ మార్క్‌ 270ను దాటే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆలస్యంగా వచ్చిన ఓట్లను కూడా అనుమతిస్తున్నారని ట్రంప్‌ మండిపడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళతామంటున్నారు. అదే సమయంలో మరో 10లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందని చివరి ఓటు వరకు లెక్కిస్తామని ప్రకటించారు గవర్నర్‌ టామ్‌ వోల్ఫ్‌. ఇందుకు తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై విమర్శలు చేయడాన్ని ప్రజాస్వామ్యం, పెన్సిల్వేనియా, తమ ఓట్లపై దాడి చేయడమే అని పేర్కొన్నారు.

నెవాడ, విస్కాన్సన్‌, మిషిగాన్‌, పెన్సిల్వేనియాల్లో ఎన్నికలు జరిగిన మూడు రోజుల వరకు కూడా మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్లను అనుమతించారు. మొదటి నుంచి మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్లపై సీరియస్‌గా ఉన్న ట్రంప్‌కు ఇది మరింత ఆగ్రహం తెప్పించింది. దీన్ని అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. ఈ రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి తానే గెలిచినట్లు ప్రకటించుకొన్నారు. దీనిపై మండిపడ్డారు జోబైడెన్‌. ట్రంప్‌ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన న్యాయస్థానికి వెళితే ఎదుర్కొనేందుకు తమ న్యాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story