US-Iran: ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు

US-Iran: ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు
X
కాల్పుల విరమణ ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు

అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య అస్థిరంగా కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో నేడు ఇస్లామాబాద్‌లో కీలక శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలు సఫలమవడం అంత సులభం కాదని, అనేక అంశాలు దీనికి అడ్డుతగిలే ప్రమాదం ఉందని ప్రముఖ అంతర్జాతీయ రిస్క్ అనలిస్ట్, యూరేషియా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమ్మర్ హెచ్చరించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విశ్లేషణ చేశారు.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని, ఇదే శాంతి ప్రక్రియకు అతిపెద్ద సవాలుగా మారవచ్చని బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తన తండ్రి అలీ ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులను కోల్పోయిన మోజ్తాబా... ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారని తెలిపారు. "అవకాశం వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఆయన కేవలం హేతుబద్ధంగా కాకుండా ప్రతీకారం, ఆగ్రహంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు" అని బ్రెమ్మర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ చర్చలు విఫలమవడానికి మరికొన్ని కారణాలను కూడా ఆయన వివరించారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని తొలగించాలని అమెరికా పట్టుబట్టడం, లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ అనుకూల గ్రూపులకు ఇరాన్ మద్దతు ఆపాలని షరతు పెట్టడం వంటివి ప్రతిష్టంభనకు దారితీయవచ్చన్నారు. అలాగే, ఇరాన్‌లోని స్థానిక మిలిటరీ కమాండర్లపై కేంద్ర నాయకత్వానికి పూర్తి నియంత్రణ ఉందా? అన్నది కూడా సందేహమేనని తెలిపారు. మరోవైపు, కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ అమెరికా గల్ఫ్ ప్రాంతానికి మూడో విమానవాహక నౌకతో కూడా సైన్యాన్ని తరలిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

ఈ వివాదంలో పాకిస్థాన్ మధ్యవర్తి పాత్ర పోషించడంపై బ్రెమ్మర్ స్పందిస్తూ, అది భారత్ స్థాయిని ఏమాత్రం తగ్గించదని స్పష్టం చేశారు. "పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ, ప్రపంచ వేదికపై భారత్ స్థాయే వేరు. టెక్నాలజీ, ఏఐ వంటి రంగాల్లో భారత్ ప్రపంచ స్థాయి శక్తిగా ఎదుగుతోంది. పాకిస్థాన్ ఆ విషయంలో ఎక్కడా లేదు. భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఉంటే, పాకిస్థాన్ కేవలం ఒక లెక్కలోకి రాని దేశం (రౌండింగ్ ఎర్రర్) మాత్రమే" అని ఆయన స్ప‌ష్టం చేశారు.

మొత్తంగా ఇస్లామాబాద్ చర్చలు ఒక సానుకూల పరిణామమే అయినా, మోజ్తాబా ప్రతీకార ధోరణి, ఇరు దేశాల కఠిన వైఖరుల కారణంగా శాంతి ఒప్పందం భవిష్యత్తు అత్యంత సంక్లిష్టంగా ఉందని బ్రెమ్మర్ విశ్లేషించారు.

Tags

Next Story