UN Security Council: కాల్పుల విరమణపై యూఎన్ తీర్మానం తిరస్కరించిన అమెరికా

గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అగ్రరాజ్యం మాత్రమే వ్యతిరేకించింది. దీంతో ఈ తీర్మానం వీగిపోయింది. గాజాలో మారణ హోమం ఆపాలని, వెంటనే యుద్ధానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మాణం చేసింది. అయితే దీనిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమోద యోగ్యం కాని ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తున్నదని భద్రతా మండలిలో యూఎస్ కౌన్సెలర్ మోర్గాన్ ఓర్టాగస్ వెల్లడించారు. అమెరికా, ఈయూ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్ అకృత్యాలను ఖండించడంలో ఈ తీర్మానం విఫలమైందన్నారు.
2023 నుంచి గాజాలో తక్షణమే కాల్పులు విరమించాలని ఐరాస ప్రవేష పెట్టిన తీర్మానాలను అమెరికా వీటో చేయడం ఇది ఆరోసారి. గాజాలో మారణహోమం సృష్టిస్తున్న ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 64 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడితో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు.
కాగా, పాలస్తీనా ఏర్పాటు కోసం ఈ నెల 13న ఐక్యరాజ్యసమితిలో పెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారం, ‘రెండు దేశాల పరిష్కార మార్గం’ అమలుపై న్యూయార్క్ డిక్లరేషన్ను ఆమోదించే తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనూహ్యంగా 142 దేశాల మద్దతు లభించింది. అన్ని గల్ఫ్ దేశాలు వీటికి అనుకూలంగా ఓటు వేయగా, ఇజ్రాయెల్, యూఎస్, అర్జెంటీనా, హంగేరి, నార్వే, పపువా న్యూ గినియా, టాంగా లాంటి దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. కాగా, గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడిని 193 సభ్యుల జనరల్ అసెంబ్లీ ఈ సందర్భంగా ఖండించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com