Germany Gurdwara: గురుద్వారలో ఘర్షణ.. 11 మందికి గాయాలు

జర్మనీలోని మోయెర్స్ నగరంలో ఉన్న ఓ గురుద్వారాలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనలో కనీసం 11 మంది గాయపడ్డారు. గురుద్వారాలో ఆధిపత్యం, నిధుల నియంత్రణ వంటి అంశాలే ఈ ఘర్షణకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..!
ప్రార్థనా మందిరంలో రెండు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. దాదాపు 40 మంది ఈ గొడవలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు కత్తులు, కిర్పాన్ల వంటి పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారు. కొందరు పెప్పర్ స్ప్రే కూడా ఉపయోగించారు. ఘర్షణకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ప్రత్యేక వ్యూహాత్మక విభాగాలు సహా భారీ ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కొత్త డైరెక్టర్ల బోర్డు ఎన్నిక, గురుద్వారా నిధులపై నియంత్రణ వంటి విషయాల్లో మాజీ, ప్రస్తుత బోర్డు సభ్యుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని, అవే ఈ దాడికి కారణమై ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. ప్రార్థనలు మొదలవడానికి ముందే దాడి చేసిన వారు పెప్పర్ స్ప్రే చల్లారు. వారిలో ఒకరు తుపాకీతో కాల్పులు జరపగా, మరికొందరు కత్తులతో దాడి చేశారు" అని ఓ వ్యక్తి వివరించారు.
గాయపడిన వారికి అక్కడికక్కడే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఎవరి ప్రాణానికీ ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన తూటా కేసింగ్ల ఆధారంగా అది బ్లాంక్-ఫైరింగ్ పిస్టల్ అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తుపాకీని ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ ఘటనపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం దర్యాప్తు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
