Air India: ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం..

Air India: ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం..
X
బాలి వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం వెనక్కి

తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం బద్దలవడంతో.. దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం దిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలోపెట్టుకొని.. తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్‌లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు వెల్లడించారు.

తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని లెవోటోబి లకి-లకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందడంతో.. దాదాపు 11 కి.మీ. ఎత్తులో బూడిద ఎగసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్ళీ విస్ఫోటనం సంభవించడంతో 1 కి.మీ. ఎత్తులో దట్టమైన బూడిద ఎగసిపడుతున్నట్లు తెలిపారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ ఏడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలయ్యిందని తెలిపారు.

కాగా, ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్‌ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలోపడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికిపైగా మరణించారు. సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు. మరోవైపు ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్‌ జోన్‌లుగా ప్రకటించారు.

Tags

Next Story