Balochistan Liberation Army: పాక్ సైన్యంపై బలూచ్ రెబల్స్ విధ్వంసకర దాడి

Balochistan Liberation Army:  పాక్ సైన్యంపై బలూచ్ రెబల్స్ విధ్వంసకర దాడి
X
రంగంలోకి మహిళా ఆత్మాహుతి దళాలు

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) చేపట్టిన 'ఆపరేషన్ హెరోఫ్' పాక్ భద్రతా దళాల్లో పెను వణుకు పుట్టించింది. ఈ దాడుల్లో అత్యంత భయానకమైన అంశం ఏమిటంటే.. తొలిసారిగా మహిళా ఫిదాయిన్లు (ఆత్మాహుతి బాంబర్లు) ముందుండి దాడులు చేయడం. ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు 200 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు బీఎల్ఏ సంచలన ప్రకటన చేసింది.

బీఎల్ఏకి చెందిన అత్యంత ప్రమాదకరమైన 'మజీద్ బ్రిగేడ్' ఈ దాడులకు నాయకత్వం వహించింది. శక్తిమంతమైన ఐఈడీ పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో పాక్ సైనిక స్థావరాలను ఛిన్నాభిన్నం చేశారు. ఈ ఆపరేషన్‌లో 11 మంది మహిళా ఫిదాయిన్లు తమను తాము పేల్చుకుని పాక్ సైన్యానికి భారీ నష్టం చేకూర్చినట్లు తెలుస్తోంది.

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ఈ పోరులో తమ యోధులు కూడా ప్రాణాలు కోల్పోయారని బీఎల్ఏ ప్రకటించింది. మరణించిన 18 మందిలో 11 మంది మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి సభ్యులు కాగా, మిగిలిన వారు ఫతే స్క్వాడ్ మరియు ఎస్టీఓఎస్ విభాగానికి చెందిన వారని వెల్లడించింది.

దశాబ్దాలుగా సాగుతున్న బలూచ్ పోరాటంలో మహిళలు ఇలా ప్రత్యక్షంగా ఆత్మాహుతి దాడులకు దిగడం పాక్ రక్షణ విభాగాన్ని ఆందోళనలో పడేసింది. ఈ దాడుల వల్ల బలూచిస్థాన్‌లోని ప్రధాన రహదారులు, సైనిక కాన్వాయ్‌లు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Next Story