ఉత్తరకొరియాలో 'ఎల్లో డస్ట్' హడల్.. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని..

ఉత్తరకొరియాలో ఎల్లో డస్ట్ హడల్.. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని..
ఉత్తరకొరియాను ఎల్లో డస్ట్‌ బెంబేలెత్తిస్తోంది. చైనా నుంచి వస్తున్న ‘ఎల్లో డస్ట్’‌ వల్ల కరోనా వైరస్‌ తమ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతో ఉత్తర కొరియా భావిస్తోంది..

ఉత్తరకొరియాను ఎల్లో డస్ట్‌ బెంబేలెత్తిస్తోంది. చైనా నుంచి వస్తున్న 'ఎల్లో డస్ట్'‌ వల్ల కరోనా వైరస్‌ తమ సామ్రాజ్యంలోకి వ్యాపిస్తుందనే భయంతో ఉత్తర కొరియా భావిస్తోంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని స్పష్టంచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని సూచించింది. అంతేకాకుండా 'ఎల్లో డస్ట్'‌ ద్వారా ప్రాణాంతక వైరస్‌ దేశంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలని అక్కడి అధికారిక దినపత్రిక రొడొంగ్‌ సిన్‌మన్‌ విజ్ఞప్తిచేసింది. డస్ట్‌తో మరింత అప్రమత్తంగా ఉండాలని... వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సూచించింది.

చైనా నుంచి వస్తున్న ఎల్లో డస్ట్‌... ప్రమాదకర విష వాయువులతో పాటు వైరస్‌లను కూడా వ్యాపింపజేస్తాయని రొడొంగ్ పత్రిక‌ అభిప్రాయపడింది. 'కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా సీడీసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్లోడస్ట్‌ను కూడా తీవ్రంగా పరిగణించాలని పేర్కొంది. ఎల్లోడస్ట్‌ వల్ల కలిగే నష్టాలను నివారించడంలో భాగంగా ప్రవేశించకుండా నిరోధించడమే అత్యంత కీలకం అని రొడొంగ్‌ సిన్‌మన్‌ వ్యాఖ్యానించింది. ఉత్తర కొరియాలోని వివిధ దేశాల విదేశాంగ కార్యాలయాలు తమ ప్రతినిధులను అప్రమత్తం చేశాయి.

చైనా, మంగోలియా దేశాల్లోని ఎడారి ప్రాంతాల నుంచి వచ్చే దుమ్ము తుపానును 'ఆసియా డస్ట్'‌, 'చైనా దుమ్ము తుఫాను', 'ఎల్లో శాండ్'‌ వంటి పేర్లతో పిలుస్తారు. ఏటా నిర్దిష్ట సమయంలో భారీ వేగంతో సంభవించే ఈ ఇసుక తుపాన్లు ఉత్తర, దక్షిణకొరియా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా చైనా పారిశ్రామిక వ్యర్థాలతో ఈ ధూళి తుపానులు మరింత ప్రమాదకరంగా మారినట్టు పలు అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ దుమ్ములోని ప్రమాదకర కణాలతో ముప్పు మరింత పెరుగుతున్నట్టు ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు భావిస్తున్నాయి. ప్రమాదకర ఇసుక తుఫాన్ల కారణంగా తీవ్ర శ్వాసకోస సమస్యలు ఎదురవుతున్నట్టు గుర్తించాయి. తాజాగా కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనా నుంచే ఈ దుమ్ము తుఫానులు సంభవిస్తుండడం ఉత్తర కొరియా ఆందోళనకు కారణమైంది.

ఉత్తర కొరియాలో ఇప్పటివరకు అధికారికంగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా అన్ని సరిహద్దుల్లో ఆ దేశం తీవ్ర ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా కుదేలవుతోన్న ఉత్తర కొరియాకు తాజా పరిస్థితులు మరింత వినాశకంగా మారినట్టు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా దేశం ఎదుర్కొంటున్న పరిస్థితిపై కిమ్‌ కన్నీటి పర్యంతమైనట్లు ఈ మధ్యే వార్తలు రావడం నిపుణుల వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story