బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం బెంగాల్‌లో దిఘాకు దక్షిణ ఆగ్నేయంగా 90 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. మధ్యాహ్నానికి బాలాసోర్‌ దగ్గర తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.. వాయుగుండం కారణంగా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరించారు. విశాఖ జిల్లాలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు..

భారీ వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆంధ్రా, సరిహద్దు ఒడిశాలో ఓ గూడ్స్‌ ట్రైన్‌ పట్టాలు తప్పింది. రాయగడలోని దోయికళ్లు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరద నీటితో పట్టాలు ధ్వంసం అయ్యి.. గూడ్స్‌ నిలిచిపోయింది. దీంతో అర్థరాత్రి ఒంటిగంట తరువాత పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని ఐదు రైల్లను దారి మళ్లించారు.. పలు రైళ్లు రద్దు కావడంతో విజయనగరం జిల్లా స్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు..

ఎగువ ఒడిషాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులకు జలకళ చేకూరింది. గొట్టా బ్యారేజీ నుండి 46, 535 క్యూ సెక్కుల నీటి విడుదల చేశారు. మధ్యాహ్నానికి లక్ష క్యూ సెక్కుల నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో వంశధార నదీ పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, నదిని దాటే వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వంశధార వరదపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జే శ్రీనివాస్‌ పరిస్థితిని సమీక్షించారు.

ఎగువ ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా నాగావళి నదిలో వరద ఉధృతి రాను రాను పెరుగుతోంది. దీంతో నాగావళి వరద నీరు కింద ఉన్న విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలోకి చేరుతోంది. వరద నీరు మొత్తం తోటపల్లి ప్రాజెక్టుకు చేరుతోంది. మరోవైపు నాగావళి వరద నీరు కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లోని పలు గ్రామాల్లోకి కూడా చేరుతోంది. కొమరాడ మండలం దుగ్గి, జియ్యమ్మవలస మండలాల్లోని బాసంగి గ్రామంలోకి కూడా చేరుతోంది. బాసంగి గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న 15 ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో దుగ్గి గ్రామాల్లో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు..

Tags

Read MoreRead Less
Next Story