ఆ దారి వెంబడి వెళితే ప్రాణ భయం గ్యారంటీ!
అది పేరుకే రహదారి.. ఆ దారి వెంబడి వెళితే ప్రాణ భయం మాత్రం గ్యారంటీ. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మలుపు ఉంటుందో.. ఎటు వైపు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందో.. బండి ఎటు వైపు జారిపోతుందో.. ఆ దేవునికే తెలియాలి. మృత్యుదారిని తలపిస్తున్న ఆ మార్గమే.. రాజీవ్ రహదారి.
సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిలో కిలోమీటర్కో మలుపు ఉంటుంది. ఇంజినీరింగ్ లోపాలకు పెట్టింది పేరు ఈ దారి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం ఈ రోడ్డుపై కామన్ విషయం. ఏటా వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నా అధికారులకు పట్టడం లేదు. ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ఆస్కారమున్న ప్రాంతాలను అధికారులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. అంతే ఆ తర్వాత ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రోడ్డుపై ఉన్న ఎత్తుపల్లాలను సవరించడం.. రోడ్డుపక్కన ఉండే రెయిలింగ్లను బలోపేతం చేయడం.. మలుపుల దగ్గర హెచ్చరిక బోర్డులను పెట్టడం ఇలాంటివి కేవలం పేపర్లకే పరిమితం అయ్యాయి.
తాజాగా గుండ్లపల్లి దగ్గర జరిగిన ప్రమాదం రాజీవ్ రహదారిలో ఉన్న ఇంజినీరింగ్ లోపాలను ఎత్తిచూపుతోంది. రహదారిపైకి రావాలంటేనే జనం భయమేస్తోందంటున్నారు గుండ్లపల్లి వాసులు. చౌరస్తా దగ్గర ఎలాంటి స్పీడ్ కంట్రోల్ వ్యవస్థ లేదని.. స్థానికులు వెళ్లేందుకు కనీసం సర్వీస్ రోడ్డు కూడా లేదంటున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న చౌరస్తాను బ్లాక్ స్పాట్గా గుర్తించినా ఎందుకు సేఫ్టీ నియమాలు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com