రిమోట్ కోసం గొడవపడి తండ్రిని చంపేశాడు

రిమోట్ కోసం గొడవపడి తండ్రిని చంపేశాడు

ఇంట్లో ఇద్దరే ఉన్నారు. తండ్రికి పాత పాటలు ఇష్టం. కొడుక్కి కొత్త పాటలు చూడాలనుంది. దీంతో తండ్రిని రిమోట్ ఇవ్వమని అడిగాడు. కొద్ది సేపు చూసి ఇస్తానన్న తండ్రి మీద ఆవేశం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తండ్రిని రోకలిబండతో మోది చంపేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశంబజార్ ప్రాంత వాసి పెరుమాళ్ల గోవర్థన్‌కు కుమార్తె జ్యోతి, కొడుకు సతీష్ ఉన్నారు. పదేళ్ల క్రితం గోవర్థన్ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు జ్యోతికి నాలుగేళ్ల క్రితం వివాహం చేయగా ఆమె అత్తారింట్లో ఉంటోంది. ఇంట్లో తండ్రీ కొడుకులు ఇద్దరే వండుకుని తింటున్నారు. గోవర్థన్ కూలీగా జీవనం సాగిస్తుండగా, సతీష్ తహసిల్ధార్ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మద్యానికి బానిసైన సతీష్.. తండ్రితో ఈ మధ్య తరచూ గొడవపడుతున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి తాగి వచ్చిన సతీష్ రిమోట్ కోసం తండ్రితో గొడవపడ్డాడు. అది కాస్తా పెద్దదై మద్యం మత్తులో తండ్రిని హతమార్చాడు. రక్తం మడుగులో ఉన్న తండ్రి మంచంపైనే పడుకుని సతీష్ నిద్రపోయాడు. తెల్లవారి లేచి తండ్రి మరణవార్తను సోదరికి చేరవేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి సతీష్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story