ఆర్టీసీ సమస్యకు పుల్‌స్టాప్ పడేదెప్పుడు?

ఆర్టీసీ సమస్యకు పుల్‌స్టాప్ పడేదెప్పుడు?

tstc

ఆర్టీసీ సమ్మెపై ఎటూ తేలడం లేదు. హైకోర్టు కమిటీ ప్రతిపాదన పట్ల విముఖత వ్యక్తం చేసిన ప్రభుత్వం.. అఫిడవిట్‌ దాఖలు చేసింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేయగా.. రూట్ల ప్రైవేటీకరణపై మాత్రం గురువారం మరోసారి వాదనలు విననుంది ధర్మాసనం.

ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం న్యాయస్థానం సూచించిన.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. అందుకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కార్మిక మంత్రిత్వశాఖకు వివాదాన్ని అప్పగించాలని కోరింది. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని పేర్కొంది. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందు వల్లే లేబర్‌ కోర్టుకు వెళ్లలేదని న్యాయస్థానానికి నివేదించింది. తదుపరి చర్యలు చేపట్టేలా కార్మికశాఖ కమిషనర్‌ను ఆదేశించాలని హైకోర్టును కోరింది.

అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సమస్యను త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు 27 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, హైపవర్ కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఎస్మా ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని అడ్వకేట్‌ జనరల్ వాదనలు వినిపించారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఈ సందర్భంగా ఏజీ ప్రస్తావించారు. ఎస్మాపై 2015లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 6 నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జీవో పొడిగిస్తారని పేర్కొన్నారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన 180 జీవోను కూడా ఏజీ ప్రస్తావించారు. అయితే 1988లో తీసుకొచ్చిన జీవో తెలంగాణకు వర్తించదని హైకోర్టు తెలిపింది. పునర్విభజన చట్టం సెక్షన్- 68 ప్రకారం.. పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు ఎస్మా పరిధిలోకి వస్తాయని ఏజీ వాదనలు వినిపించారు.

పునర్విభజన చట్టంలోని సెక్షన్-3 ప్రకారం టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశామన్నారు ఏజీ . అయితే సెక్షన్-47 ప్రకారం కేంద్రం అనుమతి అవసరం కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, రోడ్డు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయని ఏజీ తెలిపారు. అధికారాలు ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టీసీ చట్టం.. కేంద్ర చట్టంలో భాగమేనన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని.. అంతిమ విజయం తమదేనని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థమారెడ్డి చెబుతున్నారు. త్వరలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అటు మహబూబాబాద్‌ జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహంతో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల తీరును నిరసిస్తూ గురువారం మహబూబాబాద్‌ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.tstc

Tags

Read MoreRead Less
Next Story