కత్తితో దాడి చేసి.. శిక్ష పడుతుందనే భయంతో..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. తనకు జైలు శిక్ష తప్పదన్న భయంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ ఘటనలో కత్తిపోట్లకు గురైన రవీందర్ సింగరేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తన భార్యతో రవీందర్ చనువుగా ఉంటున్నాడని.. తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడని రాములు కక్ష పెంచుకున్నాడు. తన కాపురంలో చిచ్చుపెట్టాడన్న కోపంతో రవీందర్పై దాడి చేశాడు. అతన్ని కత్తితో పొడిచి పారిపోయాడు. తర్వాత కాలనీలోనే కాసేపు తిరిగాడు. రవీందర్ చనిపోతే తనకు జైలుశిక్ష పడుతుందని భయపడి చివరికి ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నాడు.
రవీందర్పై దాడి చేశాక కత్తితోనే ఇంటికి వచ్చిన రాములు.. చుట్టు పక్కలవాళ్లు ఏం జరిగిందని అడిగినా సమాధానం చెప్పలేదు. తనను ఎవరూ ఆపొద్దంటూ హెచ్చరించాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. అనుమానం వచ్చి పక్క ఫ్లాట్ల వాళ్లు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే రాములు ఉరి వేసుకుని విగతజీవిగా మారాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com