ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితులంతా పోకిరీగా తిరుగుతూ..
ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితుల్లో ఒక్కక్కరిది ఒక్కొ మనస్తత్వం. వీరంతా అల్లరిచిల్లరిగా తిరిగేవారు. గ్రామాల్లో జులాయిగా తిరుగుతూ.. ఇటీవలే లారీ పనికి పోతున్నట్టు తెలుస్తోంది. మహబూబ్నగర్-మక్తల్ ప్రధాన రహదారిపై జక్లేర్, గుడిగండ్ల రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. వీరి మధ్య చాలాకాలంగా స్నేహం ఉంది. మద్యం తాగుతూ కనిపిస్తుంటారు. అయితే వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేకపోయినా.. గ్రామంలో పలుమార్లు పెద్దలు హెచ్చరించిన సందర్భాలున్నాయి.
జక్లేర్ గ్రామానికి చెందిన మహ్మద్ పాషాతో పాటు గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు నవీన్ కుమార్, చెన్నకేశవులు, జొల్లు శివలు నలుగురూ మోటార్ ఫీల్డ్లో ఉన్నారు. పాషా, చెన్నకేశవులు డ్రైవర్లు కాగా.. నవీన్, చెన్నకేశవులు వద్ద.. జొల్లు శివ, పాషా దగ్గర క్లీనర్లుగా పని చేస్తున్నారు. నలుగురూ అటూ ఇటుగా ఇరవయ్యేళ్ల వయస్సు వారే.
నిందితులు నలుగురు కూడా అల్లరిచిల్లరిగా తిరుగుతూ చిన్నచిన్న కూలీ పనులు చేసుకునే వారు. మూడేళ్ల క్రితం వరకు ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా తన స్వగ్రామం జక్లేర్లో పెట్రోల్ బంకులో పని చేశాడు. అక్కడ వచ్చే జీతం సరిపోక రాజేంద్రనగర్లోని ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్గా చేరాడు. పక్క గ్రామమైన గుడిగండ్లకు చెందిన ముగ్గురు మిత్రులను తనతో పాటు లారీల మీద పనికి తీసుకెళ్లేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఎవరితోనూ కలివిడిగా ఉండేవాడు కాదు. డ్రైవర్గా పనిచేస్తూ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండేవాడు. గ్రామంలోకి ఎవరితో కలవడు. పాషా తల్లిదండ్రులు కూలి పని చేసుకుని బతుకుతున్నారు.
గుడిగండ్లకు చెందిన నవీన్కుమార్ తల్లితో కలిసి ఉంటాడు. అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు. పాషాతో స్నేహం తర్వాత లారీలో పనికి వెళుతున్నట్టు తెలుస్తోంది. అయితే పోకిరి వేషాలు వేసేవాడు. తన టీ వీలర్ ను స్పోర్ట్స్ బైక్లా మార్చి పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్ పెట్టాడు. హెడ్లైట్ తీసేసి డేంజర్ సింబల్ను సూచించే పుర్రె గుర్తు రేడియం స్టిక్కర్ పెట్టాడు. నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట ఎరుపు రంగులో డేంజర్ అని ఆంగ్ల అక్షరాలు పెద్దగా రాశాడు. ముందు టైరు డోమ్పైన వేటాడే క్రూర మృగం బొమ్మ వేశాడు. బైక్ని గ్రామంలో జులాయిలా తిప్పేవాడని, ఎవరైనా హెచ్చరించినా, పట్టించుకునేవాడు కాదన్నారు.
చెన్నకేశవులు ద్వారా మహ్మద్ పాషా నవీన్కు పరిచయమయ్యాడు. చెన్నకేశవులుకు ఏడాది క్రితమే వివాహమైంది. ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య గర్భిణి. ఇక జొల్లు శివ లారీ డ్రైవరు. పాషాకు క్లీనర్గా వెళ్లేవాడు. నలుగురు కలిసి ఉండేవారు. ప్రియాంకరెడ్డి హత్య విషయం తెలిసిన తర్వాత ఈ నలుగురి కుటుంబసభ్యులు కూడా గ్రామం వదిలివెళ్లిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com