దిశ హత్య కేసులో విచారణ వేగవంతం

దిశ హత్య కేసులో విచారణ వేగవంతం

rape

సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నలుగురు నిందితులను కఠినంగా శిక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు పూర్తి సాక్ష్యాధారాల్ని సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో నిందితులను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన పోలీసులు మరింత అదనపు సమాచారం రాబట్టేందుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగా నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని సోమవారం షాద్‌నగర్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో FSL నివేదిక అందిన వెంటనే అభియోగ పత్రం రూపొందించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. వరంగల్‌ జిల్లాలో చిన్నారిని అపహరించి, అత్యాచారం చేసిన కేసులో మాదిరిగానే వీలైనంత త్వరగా తీర్పు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

అటు పోలీసుల విచారణలో.. హంతకుల అత్యంత కిరాతకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుల్‌గా తాగిన మైకంలో తాము ఏం చేస్తున్నామో సోయ లేకుండా పోయిందని నిందితులు పేర్కొన్నారు. ఉదయం నుంచి ఖాళీగా లారీలోనే కూర్చోని విసుగు పుట్టిందని.. ఏదో ఒకటి చేయాలని మద్యం తాగుతూ ప్లాన్ వేసుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో దిశ వెళ్లడాన్ని గమనించిన నిందితులు.. ఆమె మళ్లీ ఎంత ఆలస్యంగా తిరిగి వస్తే తమ పని అంత సులవవుతుందని భావించినట్లు విచారణలో పేర్కొన్నారు.

రాత్రి 9 గంటల తర్వాత దిశ రావడంతో.. హడావుడిగా లారీలో నుంచి కిందికి దిగారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడ నుంచి పారిపోవాలని ప్లాన్‌ వేసుకున్నారు. ఆమెను చంపిన తర్వాత కాల్చేస్తే ఇంత దూరం వస్తుందని భావించలేదని పోలీసుల విచారణలో హంతకులు పేర్కొన్నారు.

గతంలో దొంగలించిన ఇనుమును విక్రయించేందుకు సాయంగా ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరీఫ్ పాషా.. నవీన్, చెన్నకేశవులను పిలిచాడు. దానిని విక్రయించిన హంతకులు.. 27న ఉదయం తొండుపల్లి ఓఆర్ఆర్‌ కూడలికి వచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు మద్యం తాగడం ప్రారంభించారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నలుగురూ ఏం చేశారన్నది పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్యకేసులో లారీ యజమాని సాక్ష్యం కీలకం కానుంది. నిందితులు ఆ రోజంతా అక్కడే ఉన్నట్లు లారీ యజమాని ఇచ్చే వాంగ్మూలం కేసులో కీలకంగా నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story