ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం
యూపీలోని ఉన్నావ్లో మరో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఐదుగురు నిందితులు కలిసి బాధితురాలికి నిప్పంటించారు. 60 నుంచి 70 శాతం గాయాలతో బాధితురాలు లక్నోలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. ముగ్గురు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్కు చెందిన 23 ఏళ్ల మహిళ.. ఇద్దరు వ్యక్తులపై రేప్ కేసు పెట్టింది. తనను దారుణంగా హింసించి, దాన్ని వీడియో కూడా తీశారంటూ పోలీసులకు చెప్పింది. మార్చిలో జరిగిన ఈ ఘటనపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు ఆమె వెళ్తున్నప్పుడు ఊరి బయట మాటు వేసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితోపాటు మరో ఇద్దరిని ఈ హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ రేప్ కేసులో నిందితులు తమ పలుకుబడి ఉపయోగించి తప్పించుకున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. ఆమె ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకూ ఒకరిని మాత్రమే అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది. అదే వ్యక్తి ఇప్పుడు కిరోసిన్ పోసి బాధితురాలిని చంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com