కాకినాడకు పయనమైన పవన్.. తీవ్ర ఉత్కంఠ

కాకినాడకు పయనమైన పవన్.. తీవ్ర ఉత్కంఠ

PAVAN

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కాకినాడకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న పవన్.. నేరుగా కాకినాడ వెళుతున్నారు. ఆదివారం వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ జనసైనికుల్ని పవన్‌ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయోమనని ఆందోళనలు నెలకొన్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కాకినాడలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఇంటి వద్ద కూడా.. పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా గత శనివారం వైసీపీ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి.. పవన్‌ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని నిరసించిన జనసైనికులు.. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లు ఆందోళనకు దిగి ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించారు. ఈ సమయంలో భానుగుడి సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వగా.. జనసైనికులు ప్రతిదాడి చేశారు. దొరికినవాళ్లను దొరికినట్టుగా జనసేన నేతల్ని చితగ్గొట్టారు. అసభ్య పదాలతో దూషణకు దిగారు. క్షణక్షణం ఉత్కంఠగా కొన్ని గంటలపాటు కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీగా పోలీసులు, భధ్రతా దళాలు రంగంలో దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఓవైపు జనసైనికుల ఆందోళనలు.. పోలీసుల అరెస్టులు కొనసాగాయి.

జనసైనికులపై వైసీపీ కార్యకర్తల దాడిని ఆ పార్టీ అధినేత సీరియస్‌గా తీసుకున్నారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడ చేరుకున్నారు. జనసైనికుల్ని పరామర్శించి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు పవన్ కళ్యాణ్‌.

Tags

Read MoreRead Less
Next Story