భారత్ను అష్ట దిగ్బంధనం చేస్తున్న చైనా
ఆసియా దేశాలకు పెద్దన్నగా ఎదుగుతూ ప్రపంచ దేశాల్లో పవర్ ఫుల్ ఎకనామిక్ సెంటర్ మారేందుకు చైనా ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఎన్నో కుయుక్తులకు తెరతీస్తూ వస్తోంది. డ్రాగన్ మార్కెట్ కలలకు అసియాలో ప్రధాన పోటీదారుగా మారిన ఇండియాను ఎదుర్కునేందుకు.. మన పొరుగు దేశాల్లో పాగా వేస్తోంది చైనా. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్, మయన్మార్లలో పెద్దఎత్తున ప్రాజెక్టులను చేపడుతూ.. చాపకిందనీరులా విస్తరిస్తుంది.
మార్కెట్ లో పోటీ దారు కావటమే కాకుండా సరిహద్దు విషయంలో భారత్- చైనా మధ్య వివాదం నెలకొంది. దీనికితోడు మన దాయాది దేశం పాకిస్తాన్ తో కలిసి మెగా ప్రాజెక్ట్ చేపట్టింది చైనా. పీవోకేలో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ చేపట్టిన ప్రాజెక్టులో చేరేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఇండియా మీద మరింత రగిలిపోతున్న చైనా.. భూ, జల మార్గాల్లో అష్టదిగ్బంధనం చేసే కుట్రలో ఉంది. ఇందులో భాగంగానే, చైనా-మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ను చైనా తీసుకొచ్చింది. ఇలాంటి ప్రాజెక్టును పాకిస్థాన్లో కూడా ఆ దేశం చేపట్టింది. ఈ రెండు ప్రాజెక్టులతో తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి భారత్ మీద ఒత్తిడిని పెంచింది. అలాగే, నేపాల్, భూటాన్ దేశాల్లో రోడ్డు నిర్మాణాలు, శ్రీలంకలోని హంబన్ తోట, అరబ్ ద్వీపకల్పంలోని డీజీభౌతి, పాకిస్థాన్లోని గ్వాదర్, మాల్దీవులు తదితర ప్రాంతాల్లో తన ఉనికిని చైనా క్రమంగా పెంచుకుంటున్నది.
ఇప్పటికే.. భారత్ చుట్టుపక్కల సముద్ర తీర దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, అరబ్ ద్వీపకల్పంలోని డీజీభౌతి, పాకిస్థాన్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ చైనా తన ప్రాభవాన్ని విస్తరించుకుంటున్నది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను ప్రారంభించి 70 ఏండ్లు నిండిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండురోజుల పర్యటనలో మయన్మార్కు చేరుకున్నారు. 6వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైడ్రోపవర్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, ఇంజినీరింగ్ సేవల్ని చైనా సమకూరుస్తుంది. దీంతోపాటు మయన్మార్కు పశ్చిమాన బంగాళాఖాతంలో ఒక డీప్ సీ పోర్ట్ను చైనా అభివృద్ధి చేస్తున్నది. ఈ సీ పోర్ట్ వ్యూహాత్మకంగా భారత్ కు ఎంతో కీలకం. ఇలా ఒక్కో దేశంలో పాగా వేస్తూ భారత్ ను దిగ్బంధనం చేయాలని చూస్తోంది చైనా.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com