ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రతిపక్షనేత చంద్రబాబు
తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. అనేక వ్యయప్రయాసలకోర్చి పరిశ్రమలు తీసుకొచ్చామని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కియా లాంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని వార్తలు వచ్చే పరిస్థితిని తెచ్చారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని.. విజయవాడలో జరుగుతున్న టీడీపీ నేతల విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో అన్నారు.
మహిళల సారథ్యంలో అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతోందని.. వారి ధైర్య సాహసాలను చంద్రబాబు కొనియాడారు. 1984 పోరాటంలో ఎమ్మెల్యేలు హీరోలు కాగా.. నేడు ఎమ్మెల్సీలు హీరోలయ్యారని తెలిపారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పన్న వైసీపీ.. ఇప్పుడు వైజాగ్లో ల్యాండ్ పూలింగ్ చేస్తోందన్నారు. కష్టపడి తెచ్చిన పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు. ముఖ్య నేతలకు సెక్యురిటీ తగ్గించడం దుర్మార్గమని మండిపడ్డారు. మద్యంలో జె-ట్యాక్స్ కోసం కొన్ని బ్రాండ్లు మాత్రము అమ్ముతున్నారని బాబు ఆరోపించారు. అటు.. ఇసుక భారం ప్రజలకు మోయలేకపోతున్నారని ద్వజమెత్తారు. పథకాల పేర్లు మార్చి, కొన్ని రద్దు చేసి.. పేదలను ఇబ్బంది పెడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com