కరోనా ఎఫెక్ట్ .. తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు క్లోజ్
కరోనా వైరస్ వ్యాప్తితో.. తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు.. శ్రీకాళహస్తి ఆలయాన్ని మూసేశారు. శుక్రవారం ఉదయం నుంచే భక్తులను నిలిపివేసి దేవస్థానాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. తదుపరి నిర్ణయం తర్వాతే మళ్లీ భక్తులను అనుమతించనున్నారు. ఆలయం మూసేసినా.. స్వామి అమ్మవార్లకు పూజలు, అభిషేకాలు మాత్రం యాథావిధిగా జరగనున్నట్టు ఆలయ అధికారులు తెలియజేశారు.
తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రకటించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో ఆలయాన్ని మూసివేసినట్టు పేర్కొన్నారు. ఆలయంలో స్వామివార్లకు జరిగే నిత్యపూజలను యథావిధిగా జరుగుతాయి. ఈ నిర్ణయంతో కొంతమంది భక్తులు.. వెనుదిరుగాల్సి వచ్చింది. నిత్యం భక్తులతో కిటకిటాలడే వేములవాడ ఆలయాన్నిమూసి వేయడంతో క్షేత్రం బోసిపోయింది.
తెలంగాణ సర్కార్ ఆదేశాలతో.. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరను మూసివేశారు అధికారులు. కరోనా హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తుంటారు. ఐతే మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో.. ముందస్తు జాగ్రత్తగా ఆలయాన్ని మూసివేశారు. భక్తులకు అందించాల్సిన అర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 31వరకు ఆలయం క్లో్జ్ కానున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో బాసర ఆలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com