మర్కజ్తో లింకున్న 8 మంది మలేషియన్ల అరెస్టు
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో ప్రార్ధనలకు హాజరై పోలీసుల కళ్లుగప్పి తిరిగి మలేషియాకు వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మందిని ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి మర్కజ్ కు లింకులు ఉన్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇక్కడ ప్రార్ధనల్లో పాల్గొన్నవారికి విదేశీయుల నుండి కరోనా సోకినట్టుగా కేంద్రం గుర్తించింది. మర్కజ్లో ప్రార్ధనల్లో పాల్గొనేందుకు వచ్చి లాక్ డౌన్ నిబంధనలతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన విదేశీయులపై భారత సర్కార్ నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే వారి వివరాలను సేకరించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎయిర్ పోర్టులకు పంపింది.
వాస్తవానికి అంతర్జాతీయ విమానాలు ప్రస్తుతం ఆపరేట్ చేయడం లేదు. కానీ కొన్ని దేశాలు స్పెషల్ ఫ్లయిట్లను నడిపిస్తున్నాయి. అయితే ఆదివారం మలేషియాకు ప్రత్యేక విమానం వెళ్తున్న సందర్భంగా.. మర్కజ్కు హాజరైన 8 మంది ఆ విమానాన్ని ఎక్కేందుకు ఎయిర్పోర్ట్ వచ్చారు. అయితే తమ వద్ద ఉన్న జాబితా ఆధారంగా ఈ ఎనిమిది మందిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మలిండో ఎయిర్ రిలీఫ్ ఫ్లయిట్ ఎక్కాలనుకున్న వారిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. మర్కజ్కు హాజరైన వారిని సెల్ఫోన్ డేటా ఆధారంగా గుర్తిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఆదివారం క్రైం బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు మర్కజ్కు వెళ్లాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com