ఎఫ్డీఐ విషయంలో చైనా ఆరోపణలకు భారత్ సమాధానం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై భారత్ తీసుకున్న నిర్ణయాలపై చైనా అభ్యంతరాలకు భారత్ సమాధానం చెప్పింది. తాము తీసుకున్న నిర్ణయాలతో వస్తువుల వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని.. అది ఒక పెట్టుబడులకు సంబందించిన చర్యని స్పష్టం చేసింది. భారత్ తో విదేశీ పెట్టుబడులు విషయంలో భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించిన చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రాంగ్ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు.. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంగించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే భారత ప్రభుత్వ వర్గాలు దీనికి దీటుగా సమాధానం చెప్పాయి. తాము తీసుకున్న నిర్ణయం అనుమతి నిరాకరణ క్రిందకు రాదనీ స్పష్టం చేశాయి.
కరోనా కారణంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. ఈ సమయంలో భారత కంపెనీల్లో వాటాలు విదేశీ కంపెనీలు సొంతం చేసుకొనే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో 1.01 శాతం వాటాను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా చేజిక్కించుకుంది. అటు అమెరికా కంపెనీల్లో కూడా చైనా వాటాలు కొనుగోలు చేసింది. దీంతో భారత్ ఎఫ్డీఐ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్తో సరిహద్దు పంచుకొనే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా.. భారత్ ను విమర్శిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com