ఒకే ఇంట్లో ఆరుగురికి..

ఒకే ఇంట్లో ఆరుగురికి..

కరోనా వైరస్ ఎక్కడ దాక్కుందో ఏమో కాని కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు దాదాపు 30 కేసులకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. గురువారం 40 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో అత్యధిక కేసులు గ్రేటర్ పరిధిలోనే వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ల్‌లో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరిన యువకుడికి కరోనా వైరస్ సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇక మాదన్న పేట ఆర్ఆర్ మిడోస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఒక కుటుంబంలోని ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మొదట కుటుంబంలోని పెద్దవాళ్లైన వృద్ధుడు (63), అతడి భార్య (62)కి వచ్చింది. ఆ తరువాత కొడుకుకి, అతడి ఇద్దరు పిల్లలకి, ఇంట్లో పని చేసే మహిళకు వైరస్ సోకింది. ఇదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మరో ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం 11 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఆరుగురికి రాగా వారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుమల నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. అతడి భార్య మూడు రోజుల క్రితం మరణించింది. ఆల్వాల్‌లో నివసించే వ్యక్తికి, ఆర్‌కే పురం రోడ్ నెంబర్ 6లో భార్యభర్తలిద్దరికీ, న్యూ నాగోల్ కాలనీకి చెందిన ట్రావెల్ ఏజెంట్ అయిన వారి కొడుకుకు ఇద్దరు మనవరాళ్లకు, చైతన్య పురి సత్యనారాయణపురం ప్రాంతంలో నివసించే వారి కూతురు కూడా పాజిటివ్ అని తేలడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు.

సలీం నగర్‌లో ఓ ఆటో డ్రైవర్కు, మీర్ పేట కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న అయిదుగురికి, జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సైఫ్ కాలనీకి చెందిన వ్యక్తికి, చెస్ట్ ఆస్పత్రిలో ఒకరికి, వెంకటేశ్వరనగర్‌లో వృద్ధురాలికి, అమ్లాపూర్‌లో ఒకరికి, నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ముగ్గురికి, కింగ్ కోఠి ఆస్పత్రిలో దాదాపు 13 మంది చేరారు. గోల్కొండ పీఎస్ పరిధిలో 31 పాజిటివ్ కేసులు నమోదవడంతో నెగెటివ్ వచ్చిన వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచారు.

మూసీనది పరీవాహక ప్రాంతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 69 మంది వైరస్ బారిన పడగా 8 మంది మృతి చెందారు. వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో క్వారంటైన్ కేంద్రాలు నిండిపోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story