భారత్‌లో 198 కరోనా వైరస్‌ రకాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

భారత్‌లో 198 కరోనా వైరస్‌ రకాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

కరోనా వైరస్‌..ప్రపంచదేశాలపై విషం చిమ్ముతోంది. లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను కబళించింది. భారత్‌లోనూ ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా ఈ వైరస్‌ బారినపడ్డారు. మరణాల సంఖ్య 6 వేలు దాటింది. 24గంట్లలో 9వేల 6వందలు నమోదు కాగా.. 258మంది చనిపోయారు. ఐతే భారత్‌లో ఈ మహమ్మారి ఇంతలా పంజా విసరడానికి కారణం.. వైరస్ అంతకంతకూ తన రూపం మార్చుకుంటోంది. జన్యుక్రమాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటోంది. భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్‌ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని వారు తెలిపారు.

భారత్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌పై జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు 2 నెలలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 400 జీనోమ్స్‌పై పరిశోధనలు జరుపగా వాటిలో 198 వేర్వేరు కరోనా వైరస్‌ రకాలను గుర్తించారు. కరోనా వైరస్‌ భారత్‌లో ప్రవేశించే ముందు 198 సార్లు రూపాంతరం చెందిందని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ 198 రకాల కరోనా వైరస్‌కు మూలం చైనా, యూరప్‌లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరసేనని స్పష్టం చేసింది. దీన్ని బట్టి కరోనా వైరస్ పరిస్థితులకు తగినవిధంగా రూపాంతరం చెందుతుందని తెలుస్తోంది. వుహాన్‌లో తొలి దశలో వ్యాప్తి చెందిన వైరస్‌తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరం.

అంతర్జాతీయ డేటా ఆధారంగా మార్చి మొదటి వారం, మే చివరి వారంలో వివిధ జీనోమ్స్‌ను విశ్లేషించినట్లు పరిశోధకులు తెలిపారు. వీటిలో ఢిల్లీలో 39, అహ్మదాబాద్‌ 60, గాంధీనగర్‌లో 13, తెలంగాణలో 55, మహారాష్ట్రలో 15, కర్ణాటకలో 15 వైరస్‌ రకాలను గుర్తించినట్లు తెలిపారు. చైనా, యూరప్ దేశాల నుంచి భారత్‌లో ప్రవేశించే ముందు కరోనా వైరస్ జీనోమ్స్ సమయానుకూలంగా రూపాంతరం చెందినట్లు పరిశోధకులు తెలిపారు. ఇవి ఎంత వేగంగా వ్యాపించాయి? ఏవిధంగా రూపాంతరం చెందాయి? ఎలాంటి పరిస్థితులు వీటికి తోడ్పడ్డాయి? లాంటి కారణాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story