ముద్దుతో కరోనాను మాయం చేస్తానని తానే కొవిడ్ తో..
ముద్దుల బాబాకి కరోనా సోకడంతో కాలం చేశాడు. మధ్యప్రదేశ్ లోని రత్లం జిల్లాకు చెందిన బాబా అస్లాం భక్తుల చేతి మీద ముద్దు పెడితే వారికి వచ్చిన వ్యాధులు నయం అవుతాయని ప్రచారం చేసుకునే వాడు. దీంతో భక్తులు ఆయన వద్దకు తండోప తండాలుగా రావడం మొదలైంది. ఆయన వారి చేతిపై ముద్దు పెట్టి.. వెకిలి చేష్టలు చేసి పంపించే వాడు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన భక్తులు కూడా ఆయనను దర్శించుకున్నారు. వారికి కూడా ముద్దులు పెట్టడంతో బాబాకు కరోనా వచ్చింది. బాబా చేత ముద్దు పెట్టించుకున్న 24 మందికి కరోనా సోకింది. కరోనాకి చికిత్స తీసుకుంటూ బాబా జూన్ 4న మరణించాడు. రత్లం జిల్లాలో ఇప్పటివరకు 85 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో నలుగురు మరణించారు. కాగా, మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 400 మంది మృత్యువాత పడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com