యువగళానికి అడుగడుగునా అడ్డంకులు.. గవర్నర్‌కు ఫిర్యాదు

యువగళానికి అడుగడుగునా అడ్డంకులు.. గవర్నర్‌కు ఫిర్యాదు
ఏపీ గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

ఏపీ గవర్నర్ హరిచందన్ విశ్వభూషన్‌ను టీడీపీ నేతలు శనివారం రాజ్‌భవన్‌లో కలిశారు. లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బోండా ఉమామహేశ్వర రావు, వర్ల రామయ్య, దూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, నక్కా అనంద్‌ బాబుల బృందం గవర్నర్‌ను కలిశారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ యువగళం కార్యాక్రమంలో ప్రజలతో మాట్లాడకుండా మైక్‌ను లాక్కుంటున్నారని, వాహనాలు సీజ్‌ చేశారని టీడీపీ నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

తాడేపల్లి సలహాదారులు చెప్పినంత మాత్రాన టీడీపీ కేడర్‌పై చెయ్యేసే హక్కు పోలీసుకెక్కడిదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, గౌతమ్ సవాంగ్ ల పరిస్థితి ఏమైందో అధికారులు ఆలోచన చేయాలని, లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే రేపటి నుంచి రోడ్డెక్కి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

లోకేష్ కు ప్రాణహానీ ఉందనే ఆందోళన కలుగుతోంది. సజ్జల కుమారుడు భార్గవ్ ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తోందని,పోలీసులే డ్రోన్లతో పాదయాత్ర ముందు దృశ్యాలు తీసి భార్గవ్ కి పంపుతున్నారని, ఈ దృశ్యాల ద్వారా ఎక్కడెక్కడ భద్రతా లోపాలు ఉన్నాయో చూసుకుని కుట్రలు పన్నుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు.

వైసీపీ పోలీసు గూoడాలతో యువగళం పాదయాత్రని అణగదొక్కే తీరును గవర్నర్ కి వివరించామని టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు కొల్లి రఘురామరెడ్డి అనే డీఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ నియమించిందని, ఆయన అక్రమాల చిట్టా మొత్తం మా దగ్గర ఉందని, త్వరలోనే దానిని బయటపెడతామన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు. సర్కస్‌లో జోకర్‌లాగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ కు నివేదించామాని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story