సినిమాలను తలదన్నేలా పల్నాడులో వైసీపీ నేతల మైనింగ్
వైసీపీ మైనింగ్ మాఫియాపై టీడీపీ మండిపడింది. పుష్ప,KGF లాంటి సినిమాలను తలదన్నేలా పల్నాడులో వైసీపీ నేతలు మైనింగ్ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు టీడీపీ ఆరోపించింది. పులిచింతల బ్యారేజీ నిర్మాణం పూర్తి అయ్యాక బ్యాక్ వాటర్ వలన ముంపుకి గురయ్యే గ్రామాల ప్రజలందరికీ నష్టపరిహారం చెల్లించి,గ్రామాలు ఖాళీ చేయించారు. అయితే అక్కడ ఉన్న ఖనిజ సంపదపై అధికార పార్టీ నాయకులు కన్నుపడింది.
కృష్ణనది ఒడ్డున గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలోని రేగుల గడ్డ ముంపు గ్రామాన్ని ఎంచుకున్న వైసీపీ నేతలు యధేచ్చగా మైనింగ్ చేసేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. వందలఎకరాల్లో ముగ్గురాయి నిక్షేపాలు అపారంగా ఉండటంతో ఫారెస్ట్,మైనింగ్ అధికారుల అండదండలతో అక్రమ మైనింగ్ మొదలు పెట్టారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లాలంటే సాధారణ వ్యక్తులకు ప్రవేశం ఉండదు.కూలీలను కూడా ఉదయం నాటు పడవల్లో తరలించి సాయంత్రం తిరిగి అదే నాటు పడవల్లో వారిని ఇళ్లకు పంపుతారు.సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో కనిపిస్తాయి కానీ గురజాల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పల్నాడు ప్రాంతంలో కూడా ఇలాంటి సీన్లు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఇక అక్కడ పనిచేసేందుకు భారీ యంత్రాలను మాచవరం మండలం చెన్నాయపాలెం అటవీ ప్రాంతం నుంచి తరలించారు.అసలు అక్కడ ఏమి జరుగుతుందనేది ఎవరికి తెలిసే అవకాశం కూడా ఉండదట. రేగులగడ్డ ప్రాంతంలో అనుమతి ఉన్న క్వారీల పేరు చెప్పుకొని అక్రమంగా మైనింగ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ నేతల అక్రమ మైనింగ్ పై, ఫారెస్ట్,మైనింగ్,రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యంపై టీడీపీ ఓ వీడియో కూడా విడుదల చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com