AP BJP: ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ చేయించండి

AP BJP: ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ చేయించండి
కేంద్ర హోంమంత్రి అమిషాకు పురందేశ్వరి విజ్ఞప్తి... సీబీఐతో విచారణ చేయించాలని వినతి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అండదండలతో నాసిరకం మద్యం ఏరులై పారుతోందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. మద్యం విక్రయాల్లో వేలకోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర హోంమంత్రి అమిషాను ఆమె కోరారు. ఏపీలో మద్యం వ్యాపారంలో ప్రతి ఏటా 25 వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఢిల్లీలో అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందించారు. మద్యం వ్యాపారంలో భారీ అవినీతి జరుగుతోందని, ఇక్కడ విక్రయిస్తున్న నాసిరకం మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. సీఎం జగన్‌, అతని అనుచరుల జేబులు నింపడానికి వేల కోట్లు రూపాయలు దారిమళ్లిస్తున్నారన్నారు.


మద్యం తయారీ విధానం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని పురందేశ్వరి వివరించారు. మద్యం తయారీకి ముడిసరకుగా ఉపయోగించే రెక్టిఫైడ్‌ స్పిరిట్‌లోని హానికరమైన పదార్థాలను తొలగించేందుకు మద్యం తయారీదారులు ఇదివరకు ఎన్నోసార్లు దాన్ని డిస్టిల్‌ చేసేవారన్నారు. ప్రస్తుతం డిస్టిలేషన్‌ ప్రక్రియనే అనుసరించడం లేదని, అందులో ఉన్న హానికారక పదార్థాలను తొలగించడంలేదని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. లీటర్‌ మద్యం తయారీకి 15 రూపాయలు ఖర్చయితే, దాన్ని 600 నుంచి 800 రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. పైగా 80 శాతం విక్రయాలను నగదు రూపంలోనే చేస్తున్నారని చెప్పారు.

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ కూడా ఆర్థికంగా సంతృప్తి పరిచిన కంపెనీల నుంచే మద్యం కొనుగోలు చేస్తోందని పురందేశ్వరి హోమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలా చేసిన అక్రమార్జనంతా రాష్ట్రంలో ఉన్నతస్థాయిలో కూర్చున్నవారికి నేరుగా చేరుతున్నట్లు ఆరోపించారు. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యంపై వసూలు చేస్తున్న స్పెషల్‌ డ్యూటీ రాష్ట్ర ఖజానాకు చేరడంలేదని అది ఎక్కడికిపోతోందన్నది ప్రశ్నార్థకమన్నారు.


నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో వారిపై ఆధారపడిన వేలమంది రోడ్డునపడుతున్నారన్నారు. ఇన్ని పేద కుటుంబాలు అతలాకుతలం కావడానికి సీఎం జగన్‌, అతని వందిమాగధులే ప్రధాన కారణమని చెప్పారు. వ్యక్తిగతంగా ఆసుపత్రులను సందర్శించి అక్కడి డాక్టర్లతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలో లివర్‌ సిరోసిస్‌, ప్రాంక్రియాటిస్‌తో సంభవించే మరణాల సంఖ్య 25 శాతం పెరిగినట్లు తేలిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిత్‌ షాకు పురందేశ్వరి వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story