SHARMILA: ప్రధానికి షర్మిల లేఖాస్త్రం

SHARMILA: ప్రధానికి షర్మిల లేఖాస్త్రం
పునర్విభజన చట్టం హామీలు అమలు చేయాలన్న ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆవేదన

పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. దశాబ్దం తర్వాత కూడా విభజన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలిందని తన లేఖలో షర్మిల తెలిపారు. ఎన్నికల సమయంలో మరిన్ని హామీలిచ్చినా నెరవేరలేదన్నారు.పునర్విభజన జరిగి దశాబ్దమైనా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోతూనే ఉన్నారని పేర్కొన్నారు. హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని మోడీకి రాసిన లేఖలో షర్మిల విమర్శించారు. ఇకనైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


జగన్‌ అప్పటి అన్న కాదు

ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో షర్మిల వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం నిస్వార్థంగా పని చేస్తే తనపై రోజుకో కట్టుకథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి రోజుకో జోకర్ బయటకు వచ్చి దుష్ర్పచారం చేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను సీఎం చేయాలని తన భర్త అనిల్ ప్రణబ్ ముఖర్జీని అడిగారని ఒక కట్టుకథ పుట్టించారని షర్మిల ఆరోపించారు. గతంలో జగన్ సతీమణి భారతీరెడ్డితో కలిసే తన భర్త సోనియాగాంధీ వద్దకు వెళ్లారని వెల్లడించారు. ఈ విషయం గురించి భారతీరెడ్డి ఏమైనా సాక్ష్యం చెబుతారా అని షర్మిల ప్రశ్నించారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారన్న ఆమె సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ని అవరోధాలు కల్పించినా ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు.


అంతకుముందు షర్మిల వివేక కుమార్తె సునీత ఇడుపులపాయ ఎస్టేట్ లో కలిశారు రెండు గంటలకుపైనే సాగిన ఈ సమావేశంలో ఇద్దరు రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిసింది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య తర్వాత ఐదేళ్ల నుంచి సీఎం జగన్ ,ఎంపీ అవినాష్ రెడ్డిపై ఒంటరి పోరు చేస్తున్న సునీతకు షర్మిల అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఇద్దరూ సమావేశం కావడం, వైఎస్ కు నివాళులర్పించడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో కడప లేదా పులివెందుల నుంచి జగన్ ను బలంగా ఢీకొనాలంటే ఆ కుటుంబం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో షర్మిల సునీతతో సమావేశమైనట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story