AP HC: కోడి పందేల నిర్వహణ.. క్రూరమే

AP HC: కోడి పందేల నిర్వహణ.. క్రూరమే
కోడిపందేలను నిలువరించాలన్న హైకోర్టు... ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని స్పష్టీకరణ

కోడిపందేల నిర్వహణ జీవాలపట్ల క్రూరానికి పాల్పడటమేనని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీలో కోడిపందేల నిర్వహణను నిలువరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ పందేలు భారీ జూదానికి అవకాశం కల్పిస్తోందని, దానిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఏపీలో కోడి పందేలను నిలువరించేందుకు హైకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లును ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడిపందేలు నిర్వహించకుండా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని, విచ్చలవిడి జూదాన్ని అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కేవీ ఆదిత్యచౌదరి వాదనలు వినిపించారు .


కోడిపందేల నిర్వహణ జంతుహింస నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధం అన్నారు. కోడిపందేల నిర్వహణను అడ్డుకోవాలని, ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని హైకోర్టు గతంలో కీలక ఉత్తర్వులిచ్చిందన్నారు. ఆ తీర్పును అధికారులు అమలు చేయడం లేదన్నారు. తీర్పును సరైన స్ఫూర్తితో అమలు చేసేందుకు తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ఘాటించింది. కోడిపందేలు జరగకుండా చూడాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. జంతుహింస నిరోధక చట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. చట్టాల్ని సక్రమంగా అమలు చేయకపోతే కలెక్టర్, పోలీసు కమిషనర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది.


చట్టం అమలులో నిర్లక్ష్యం వహించిన తహశీల్దార్లు, పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. అధికారులను భాగస్వామ్యులను చేస్తూ పత్రి మండలానికి కమిటీలను ఏర్పాటు చేసి కోడిపందేలు జరగకుండా చూడాలంది. అన్ని మండలాల్లో ‘సంయుక్త తనిఖీ బృందాలను 2024 జనవరి 14లోపు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఎస్సై ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, తహశీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసిన స్వచ్ఛంద సంస్థ నుంచి సభ్యుడు ఆ బృందంలో సభ్యులుగా ఉండాలని స్పష్టంచేసింది. ప్రతి తనిఖీ బృందంతో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ ఫోటోగ్రాఫర్‌ ఉండేలా ఏర్పాట్లు చేయాలంది.

Tags

Read MoreRead Less
Next Story