BRS: ప్రజా క్షేత్రంలోకి కేసీఆర్‌

BRS: ప్రజా క్షేత్రంలోకి కేసీఆర్‌
నల్గొండలో బహిరంగ సభలో పాల్గొననున్న గులాబీ దళపతి.... కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్‌ వైఖరిపై ఆగ్రహం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఔట్ లెట్ల స్వాధీనం విషయంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. కృష్ణా జలాల పరిరక్షణ కోసం భారత రాష్ట్ర సమితి వచ్చేవారం నల్గొండలో బహిరంగసభ నిర్వహించనుంది. శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 13వ తేదీన సభ నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్... కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్దమవుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన భేటీలో పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.


శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తాజా పరిణామాలతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. శ్రీశైలం, సాగర్ ఔట్ లెట్లను అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని పేర్కొన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని, షరతుల గురించి సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వాస్తవ విరుద్ధంగా మాట్లాడారని, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు సమావేశంలో వివరించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా... తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోబోమన్న కేసీఆర్... ఈ విషయంలో పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్దామని నేతలకు వివరించారు. తాను కోలుకున్నానని, ఇక ప్రజల్లోకి వస్తానని చెప్పారు.


కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమావేశం వ్యతిరేకించింది. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భారాస ఆక్షెపించింది. కృష్ణా బోర్డుకు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఔట్ లెట్లను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వ.... తెలంగాణ, వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నల్గొండ సభకు హాజరు కానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story