Ap :జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్‌

Ap  :జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్‌
ఆర్థిక సంఘం నిధుల చెల్లింపుకు చెక్

జగన్‌ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్‌ ఇచ్చింది. ఆర్థిక సంఘం నిధులను సొంత అవసరాలకు ఇష్టానుసారం మళ్లించడానికి వీళ్లేకుండా చెక్‌ పెట్టింది. స్థానిక సంస్థలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకే నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటోంది.

పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్‌ పెట్టింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించింది. వాటిలో నిధులు జమ చేసి పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పోర్టల్‌కు మ్యాపింగ్‌ చేయిస్తోంది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు లోబడి చేయించే పనులకు బ్యాంకు ఖాతాల్లోని నిధులను ఇకపై పట్టణ స్థానిక సంస్థలే నేరుగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని CFMSకి బిల్లులు అప్‌లోడ్‌ చేయడం, ఎప్పుడు నిధులిస్తే అప్పుడే పట్టణ స్థానిక సంస్థలు తీసుకోవడం వంటి నిరంకుశ విధానానికి చెల్లుచీటీ పాడుతోంది.

రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ నియంత్రణలోని పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోనే ఆర్థిక సంఘం నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఖాతాల్లో నిధులున్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా.. పూర్తి చేసిన పనులకు ఆర్థిక శాఖ నిధులు వెంటనే విడుదల చేయదు. నిధులు అందుబాటులో ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు విదిలిస్తోంది. దీంతో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఎప్పుడూ 150 కోట్ల నుంచి 200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. చాలాచోట్ల పనులకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

పంచాయతీలకు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను.. విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వాటిలో రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని కట్టడి చేసింది. పంచాయతీల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటికే నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంది. 2023-24లో విడుదలైన నిధులు ఈ ఖాతాలకే జమయ్యాయి. ఇప్పుడు పట్టణ స్థానిక సంస్థల్లోనూ అదే విధానం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేర్లతో తెరిపించిన బ్యాంకు ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం 530 కోట్ల ఆర్థిక సంఘం నిధులను రెండు రోజుల క్రితం జమ చేసింది. ఇవి 2022-23లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులే. తాజా చర్యలతో ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదు. బ్యాంకు ఖాతాలను PFMS పోర్టల్‌కు మ్యాపింగ్‌ చేయడంతో పనుల నిర్వహణ, నిధుల వ్యయంపై కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించనుంది. రెండేళ్ల క్రితమే కేంద్రం ఇలాంటి చర్యలు తీసుకుని ఉంటే.. ఆర్థిక సంఘం నిధులతో పట్టణ స్థానిక సంస్థల్లో అనేక అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉండేదన్న వాదన వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story