AP: తుపాను నుంచి తేరుకోని ఏపీ రైతులు

AP: తుపాను నుంచి తేరుకోని ఏపీ రైతులు
రోజులు గడుస్తున్నా పొలాల్లోనే వరద నీరు... కన్నీరుమున్నీరు అవుతున్న అన్నదాతలు

మిగ్‌జాం తుపాను గాయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రైతులు తేరుకోలేకపోతున్నారు. నాలుగైదు రోజులు దాటినా పొలాల్లో నీళ్లు, అన్నదాత కళ్లలో కన్నీళ్లు ఇంకడం లేదు. ఎవర్ని కదిపినా నిండా మునిగామంటూ బోరుమంటున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో వేలాది ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. నాలుగు రోజులైనా చేలల్లో నుంచి నీరు బయటకు పోకపోవడంతో పంట నష్టం మరింత పెరిగింది. తేమశాతం ఎక్కువగా ఉందని రైతు భరోసా కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తాళ్లరేవు మండలంలో పర్యటించిన తెలుగు యువత నేత ధూళిపూడి బాబీ రైతులను పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజులుగా వరిచేలు నీటిలో నానుతున్న ప్రభుత్వం పరిశీలించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.


మిగ్‌జాం అపారమైన పంటనష్టాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సుమారు 20లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా 7 వేల కోట్ల రూపాయలకుపైగా అన్నదాతలు నష్టపోయారని భావిస్తున్నారు. అయినా ప్రభుత్వం పంట నష్ట తీవ్రతను అంచనా వేయడంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తుపాను హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి ప్రభావం 8 జిల్లాల్లోనే ఉంటుందంటూ వాటిపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వంమిగతా జిల్లాలోనూ రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు.


శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా.... లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. ఉద్యాన పంటలు నేలకొరిగాయి. అత్యధికశాతం రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక..ఉత్త చేతులతో మిగిలారు. తుపాను తీరం దాటి 3 రోజులవుతున్నా వరద తగ్గలేదు. పొలాల్లో నీరు బయటకు పోలేదు. వరి, మిరప, శనగ, కంది, మినుము, పొగాకు పైర్లు నీటిలో నానుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉంటుందని అంచనా. ఇందులో వరి సుమారు 12 లక్షల ఎకరాలు, మిరప 2.5 లక్షల ఎకరాలు, శనగ, కంది, మినుము 5.50 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. ఎకరాకు సగటున రూ. 20 వేల లెక్కన చూసినా.. పంటనష్టం రూ. 4 వేల కోట్ల పైనే ఉంటుంది. పండ్లు, పూలతోటలు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని అంచనా. అరటి, బొప్పాయి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టం రూ. 1,250 కోట్ల వరకు ఉంటుంది. తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే.. ఇది రూ. 7 వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా. పంటలు దెబ్బతిన్న వారిలో 80% మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కోత కోయించడం కంటే ట్రాక్టర్లతో దమ్ము తొక్కించేయడమే మేలని వరి రైతులు ఆలోచిస్తున్నారంటే..రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story