Dsc: తెలంగాణలో మెగా డీఎస్సీ ఆంధ్రాలో ?

Dsc: తెలంగాణలో  మెగా  డీఎస్సీ ఆంధ్రాలో ?
ఆంధ్రాలో అడ్రస్ లేని డీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణలో 11వేల 62 పోస్టులతో మెగా డీఎస్సీ విడుదలైంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 29వేల 571 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 28 లక్షల మంది. 2017లో 8 వేల 792 పోస్టులు భర్తీచేశారు. ఇవికాకుండా గురుకులాల్లో తొమ్మిదేళ్లలో మూడు విడతల్లో 27వేల బోధన పోస్టుల నియామకాలు చేశారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు 44వేల 426 ఉండగా వీటిలో చదివే విద్యార్థులు 38.25 లక్షల మంది. తెదేపా హయాంలో 18వేలకు పైగా పోస్టులతో రెండు డీఎస్సీలు వేశారు. జగన్‌ సర్కార్‌ ఐదేళ్లకు కలిపి 6 వేల 100 పోస్టులనే ప్రకటించింది. తెలంగాణ కంటే ఏపీలో బడులు.. విద్యార్థులు ఎక్కువే.. అయినా పోస్టుల సంఖ్య పెరగలేదు. ప్రపంచబ్యాంకు రుణం కోసం వైకాపా ప్రభుత్వం ఆడుతున్న జగన్నాటకంలో పోస్టులు ఆవిరైపోతున్నాయి.

పొరుగునున్న తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను వెతికి మరీ భర్తీచేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం జగన్‌ సర్కార్‌ ఉన్న ఖాళీలను దాచేసి, నిరుద్యోగులను మోసగిస్తోంది. ఏపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏటా డీఎస్సీ నిర్వహించిందా అంటే.. అదీ లేదు. జగన్‌ ప్రభుత్వం పెంచిన రెండేళ్ల పదవీ విరమణ వయస్సు గడువు జనవరితో ముగిసింది. రాబోయే నెలల్లో పదవీ విరమణలు విరివిగా ఉంటాయి. కానీ..ప్రభుత్వం 6 వేల100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి.. ఇక ఖాళీలు లేవంటోంది. చదువుపై పెట్టే ప్రతిపైసాను పెట్టుబడిగా భావిస్తానని, ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడాలని సీఎం జగన్‌ తరచూ సభల్లో ఊదరగొడుతూ ఉంటారు. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోతే గ్లోబల్‌ విద్యార్థులు ఎలా తయారవుతారు.? ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పెట్టుబడి కాదా..? అన్న విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణలో ప్రతి పంచాయతీలో కనీసం ఒక పాఠశాల ఉండాలనే నిబంధనను అక్కడి ప్రభుత్వం పెట్టింది. బడులు లేకపోతే కొత్తవాటిని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. పేద పిల్లలకు బడులను ఇంటికి సమీపంలో ఉంచేలా చూస్తోంది. ఏపీలో వైకాపా ప్రభుత్వం బడుల నిర్వహణలోనూ... రివర్స్‌ విధానం పాటిస్తోంది. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించింది. ప్రాథమిక బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి వాటికవే మూతపడుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 587 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. విలీనం కారణంగా 118 బడులకు తాళాలు వేశారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య 9 వేల 602కు పెరిగింది. మూతపడుతున్న వాటిలో ఎక్కువగా ఎస్సీ కాలనీలు, ఎస్టీల ఆవాసాల్లో ఉన్నవే. ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీలు, గిరిజనులకు ప్రాథమిక విద్య దూరమవుతుంది. ఇంత జరుగుతున్నా.. జగన్‌ సర్కార్‌ మాత్రం మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధనంటూ గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story