EC: ఇద్దరు ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం వేటు

EC: ఇద్దరు ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం వేటు
నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా బదిలీ .. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు

అధికార వైసీపీతో అంటకాగుతూ అయిదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ IPS అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ..ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది. తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి, తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ వారికి ఎన్నికల సంబంధిత విధులేవీ అప్పగించొద్దని నిర్దేశించింది. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి IPS అధికారుల పేర్లతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్‌ సమర్పించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్నే పంపాలని పేర్కొంది.


విజయవాడ సీపీగా పనిచేసస్తున్న కాంతిరాణా టాటా.. అఖిలభారత సర్వీసు అధికారిననే విషయం మరిచిపోయి వైసీపీ అధికార ప్రతినిధిలా వ్యవహరించారు. ప్రతిపక్షపార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, వారిపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టారు. తెలుగుదేశంలో క్రియాశీల నేతలను లక్ష్యంగా చేసుకుని వేధించారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైసీపీ పట్ల తన విధేయత, స్వామిభక్తిని ప్రదర్శించటంలో కాంతిరాణా వెనక్కి తగ్గలేదు. టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు మీడియాపైన రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదిచ్చారు. తాను కళంకితుడిగా ఉంటూ.. వైసీపీతో అంటకాగుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారులందరి తరఫున వకల్తా పుచ్చుకుని మీడియా, ప్రతిపక్షాలపై రాజకీయంగా విషం చిమ్మటం కాంతిరాణాకే చెల్లింది. ఇవే అంశాలతో ఐపీఎస్‌ అధికారుల సంఘం పేరిట ఆయనే ప్రకటన విడుదల చేసేశారు. కానీ అదే ఎన్నికల సంఘం ఆయన వైసీపీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదుల ఆధారంగా తాజాగా వేటు వేసింది.


ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన కాంతిరాణా భార్య... భువనేశ్వర్‌లో పనిచేస్తున్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి, వైద్యారోగ్య శాఖలో కీలక పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అన్నట్లు వైసీపీ అరాచకాలకు మరింతగా కొమ్ముకాశారు. అనంతపురం రేంజి డీఐజీగా పనిచేసినప్పుడు మంత్రి పెద్దిరెడ్డి చెప్పిందే చట్టం అన్నట్లుగా పనిచేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను బస్సుల్లో తీసుకొస్తుంటే వారిని అడ్డుకోకపోగా... అప్పటి ఎస్పీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను నిలువరించారన్న ఫిర్యాదులున్నాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరుగార్చారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో టీడీపీ శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకుల అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు.

సీఎం జగన్‌పైకి గులకరాయి విసిరిన ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణం. ఈ వ్యవహారంలో వేళ్లన్నీ కాంతిరాణా వైపే చూపిస్తున్నాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదుచేసిన కాంతిరాణా... అందులో టీడీపీ నాయకుల్ని ఇరికించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. తద్వారా వైసీపీకి మేలు కలిగించేలా దర్యాప్తు చేశారన్న ఫిర్యాదులున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story