Mekapati Goutham Reddy : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం
Mekapati Goutham Reddy : ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకొని ఆయన నిన్ననే హైదరాబాద్ వచ్చారు. గౌతమ్రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే పల్స్ కనిపించలేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తమవంతు ప్రయత్నంగా అత్యవసర వైద్య చికిత్స అందించామని.. కానీ అత్యవసర వైద్యానికి స్పందించకపోవడంతో గుండెపోటుతో మరణించారని వైద్యులు ధృవీకరించారు. ఉదయం 8గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
రెండుసార్లు కరోనా నుంచి కోలుకున్నారు గౌతమ్రెడ్డి. అయితే... పోస్ట్ కోవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమని అనుమానిస్తున్నారు. గౌతమ్రెడ్డి మరణవార్త తెలుసుకున్న బంధువులు హుటాహుటిన హైదరాబాద్కు పయనమయ్యారు. దుబాయ్ ఎక్స్పో వివరాలు వెల్లడించేందుకు రేపు సీఎం జగన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు గౌతమ్రెడ్డి. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మణిమంజరి దంపతులకు 1971 నవంబర్ 2న మేకపాటి గౌతమ్రెడ్డి జన్మించారు. గౌతమ్రెడ్డికి కుమార్తెలు శ్రీకీర్తి, అనన్యరెడ్డి, కుమారుడు అర్జున్రెడ్డి ఉన్నారు. గౌతమ్ రెడ్డి ఇంగ్లండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో టెక్స్టైల్స్ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు కేఎంసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వంగా 2014లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ ఏశారు. 2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30వేల 191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచారు. మేకపాటి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా మంచి పట్టు ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com