రాష్ట్రంలో అరాచక పాలనను ప్రశ్నిస్తూనే ఉంటా : నారా లోకేశ్
రాష్ట్రంలో అరాచక పాలనను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు నారా లోకేష్. అన్యాయాలపై నిలదీస్తుంటే దాడులకు పాల్పడుతున్నారని, ప్రజలంతా ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని మండిపడ్డారు. మాజీ MLA తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన లోకేష్.. నందిగామ వెళ్లి ఆమెను పరామర్శించారు. లోకేష్ వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమ సహా నియోజకవర్గ ముఖ్యనేతలు, పలువురు జిల్లా నేతలు ఉన్నారు.
నారా లోకేష్ రాక సందర్భంగా నందిగామ నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. సౌమ్యను కలిసిన తర్వాత నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు లోకేష్. బైక్ ర్యాలీలో క్యాడర్ అంతా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
నందిగామలో ర్యాలీ అనంతరం తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో వైసీపీ దాడిలో గాయపడ్డ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి దంపతులను లోకేష్ పరామర్శిస్తారు. ఆ తర్వాత తిరువూరు నియోజకవర్గంలోని గొల్లమందల గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా హత్యకు గురైన టీడీపీ కార్యకర్త సోమయ్య కుటుంబాన్ని కూడా పరామర్శించి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com