Pawan Kalyan: అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటి?: పవన్ కల్యాణ్
Pawan Kalyan: కోనసీమ గొడవలకు వైసీపీయే కారణమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మొదట్లోనే అన్ని జిల్లాలతో పాటు కోనసీమకు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారాయన. అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం గొడవలు జరిగేలా వాతావరణం కల్పించిందన్నారు. గొడవలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారా? అని ప్రశ్నించారు.
కొత్త జిల్లాలకు పేర్లు పెట్టేటప్పుడు మరింత సున్నితంగా వ్యవహరించాలన్నారు. కృష్ణానది ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారని, సముద్రం ఉన్న జిల్లాకు కృష్ణా అని పేరు పెట్టారన్నారు. కోనసీమలో గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు పవన్ కల్యాణ్. అందుకే అభ్యంతరాలపై 30 రోజులు గడవిచ్చారా? అని ప్రశ్నించారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టేలా చేశారని, వైసీపీ దురుద్దేశం ఇట్టే అర్థమవుతుందన్నారు పవన్. ఈ గొడవలు చాలా పద్ధతిగా చేసిన గొడవలని తెలుస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా కనీసం ఆపకపోగా.. ప్రోత్సహించారంటూ మండిపడ్డారు. కోనసీమలో వైసీపీయే చిచ్చుపెట్టిందన్నారు పవన్ కల్యాణ్. దాడులకు జనసేన కారణమన్న ఆరోపణలని ఖండిస్తున్నామన్నారు పవన్ కల్యాణ్.
తాను ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లలేమన్న ఆయన.. జిల్లాలకు జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టడం జనసేన సమర్ధిస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు ఆజ్యం పోసిందంటూ విమర్శించారు పవన్ కల్యాణ్. ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసును డైవర్ట్ చేయడానికే వైసీపీ ఈ గొడవలు సృష్టించిందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com